Sunday 12 July 2015

హిందూ ధర్మం - 166 (వేదాంగ పరిచయం - 2)



చాలామందికి సమాధి స్థితి ఎంతో సాధన తర్వాత కలిగినా, అది కొంత సేపు మాత్రమే ఉంటుంది. కానీ భగవాన్ రమణ మహర్షి మాత్రం వారికి తొలిసారి సమాధి స్థితి అనుభూతి కలిగిన క్షణం నుంచి, వారు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆధునిక కాలంలో భూమిపై తిరిగిన మహర్షి రమణులు. వారి భోధనలు కూడా చాలా పైస్థాయి లో ఉంటాయి. రమణమహర్షి శరీరంతో ఉన్న రోజులలో జరిగిన ఒక సంఘటన మనకు ఒక సందేశాన్నిస్తుంది. సాధారణంగా రమణాశ్రమంలో రోజు కాసేపు మహర్షి భోధనల మీద చర్చ జరిగేది. అందులో ఒకసారి పదిమంది భక్తులు, ఒకానొక రచనలో విషయం మీద వాదులాడుకోవటం ప్రారంభించారు. ఎంతకూ వాదనకు పరిషాకారం దొరకటంలేదు. మహర్షి అక్కడే మౌనంగా అన్నీ గమనిస్తున్నారు. తమ వాదనలో ఏది సరైనదని వారందరూ వెళ్ళి మహర్షిని అడిగారు. దానికి బదులుగా మహర్షి అన్ని సరైనవే అన్నారు. అదెలా అవుతుంది అన్నారు భక్తులు. ఎవరి స్థాయిలో వారికి అది సత్యమే. వారి స్థాయి పెరిగితే కానీ వారికి గురువే చెప్పినా అసలు విషయం అర్దమవ్వదు. ప్రాప్యతను, సంస్కారాన్ని అనుసరించి ఉంటుంది అన్నారు ................ ఇది నిజమే. ఆధ్యాత్మికతలో ఇలాగే ఉంటుంది. కానీ మనకూ స్థాయి పెరగలాంటే స్వధర్మాచరణయే గతి. అంటే కేవలం పుస్తకాల్లో ధర్మాన్ని చదివి తెలుసుకునుట కాదు, ధర్మాన్ని ఆచరించుట. దానికి మించి వ్యక్తి సంస్కారాన్ని, స్థాయిని పెంచే వెరొక మార్గం లేదు. ఒకే ప్రవచనాన్ని వందలమంది విన్నా, అందరికి తలొకరీతిలో అర్దమవుతుంది. ఋషులకు ఈ విషయం తెలుసు. ఆధ్యాత్మికత పక్కన పెట్టినా, అసలు అన్నిటికి ధర్మమే మూలం. ధర్మం అర్దమవ్వాలంటే వేదం అర్దమవ్వాలి. వేదంలో ఒకే పదం అనేక చోట్ల కనిపించినా, దానికి ఒకే అర్దం ఉండదు. ప్రతి సందర్భంలోనూ అర్దం మారుతుంది. ఇది ఆలోచించిన ఋషులు వేదాలను అర్దం చేసుకుని వ్యాఖ్యానించడం కోసం ఒక ప్రమాణాన్ని ఏర్పరచాలనుకున్నారు.

వేదాలను ఋషులు స్వరబద్ధంగా దర్శించారు. వేదానికి స్వరమే ప్రాణం.అన్ని వేదాలకు ఒకటే స్వరం ఉండదు. అందులో మళ్ళీ అన్ని పదాలు చదవటంలో ఒకే వేగం కూడా ఉండదు. అన్నిటికి ఒక విధమైన శబ్దం ఉండదు. కనుక వేదంలో ఉఛ్ఛారణ దోషం రాకుండా ఉండుటకు, తాము ఎలా దర్శించామో, అలాగే ఈ వేదం ముందు తరాలకు అందటం కోసం ఒక వ్యవస్థ కావాలి.

ఏదో చెప్పారని అది గుడ్డిగా ఆచరిస్తూ వెళ్ళడమేనా? అసలు ఒక వస్తువును వర్ణించినటానికి ఒక ప్రత్యేక పదాన్నే ఎందుకు వాడారు? పదాలు ఎలా ఏర్పడ్డాయి? ఒక వస్తువును ఒక విధంగా సంబోధించడం ఎందుకు? ఇత్యాది విషయాలు కూడా జనులకు అర్దమవ్వాలి. అందుకుగానూ ఒక శాస్త్రం ఉండాలి.

వేదం కర్మను, జ్ఞానాన్ని రెండిటిని చెప్పింది. జ్ఞానం ఎంత ప్రధానమో, కర్మ కూడా అంతే ప్రధానం. కర్మ కారణంగానే జ్ఞానం సిద్ధిస్తుంది. కానీ వదిక కర్మలు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికి నిర్ధారిత సమయం ఉంది. అదేదో ఒక్క రోజుకే పరిమితమైన కాలనిర్ణయం కాదు, ఋతువులను అనుసరించి కూడా ఉంటుంది. వేదంలో చెప్పబడ్డ అన్ని యజ్ఞాలు ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ చేయరు, చేయకూడదు. కాబట్టి కాలాన్ని నిర్ణయించటానికి ఒక ప్రమాణం ఉండాలి. అదికూడా కాలాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లెక్కవేసుకోవడం కాదు, విశ్వం ఉంది, అందులో గ్రహాలు, నక్ష్త్రాలు ఉన్నాయి, వాటికి భ్రమణం ఉంది, విశ్వానికి ఒక భ్రమణం ఉంది, అన్నిటికి కాలం ఉంది, ఆ కాలనికి లోబడే మానవులు కాలాన్ని లెక్కగట్టాలి, అది విశ్వగతికి అనుకూలంగా ఉండాలి. అది జరగాలంటే కాలాన్ని లెక్కవేసే ఒక నిర్ధుష్టమైన, ఖఛ్ఛితమైన పద్ధతి ఉండాలి. అదేకాక వైదిక కర్మ చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారం చేసినప్పుడే అది ఫలితాన్ని ఇస్తుంది. అదేగాక అందులో ఆహుతి ఇబ్బడే ద్రవ్యాలు కూడా సరైనవే అవ్వాలి. అందుకు మార్గదర్శనం కావాలి.  ఇలాంటి అనేక కారణాలను, అంశాలను దృష్టిలో ఉంచుకుని ఋషులు వేదాంగాలను అందించారు. మొత్తం 6 వేదాంగాలు ఉన్నాయి.

శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అనే ఈ ఆరింటిని వేదాంగాలు అంటారు.

అంగాలు అంటే అవయవాలు. కళ్ళు, ముక్కు మొదలైనవి. ఇవన్నీ వేదానికి అంగాలు కనుక వేదాంగాలు అయ్యాయి.
1. శిక్ష - ముక్కు - ఉఛ్ఛారణా శాస్త్రం
2. వ్యాకరణం - నోరు
3. ఛందస్సు - కాలు
4. నిరుక్తం - చెవి
5. జ్యోతిష్యం - కళ్ళు - కాలప్రమాణాలు, ముహూర్తాలు
6. కల్పం - చేతులు

To be continued...................

No comments:

Post a Comment