Monday 27 July 2015

పుష్కరాలు - నా అనుభవాలు - 1

పుష్కరాల్లో నా అనుభవాలు - 1

పుష్కరాల గురించి మీడియా రెండుగా విడిపోయింది. ఒకదానికి ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసిందని పొగిడడమే పని, ఇంకోవైపు ఏర్పాట్లు చెత్తగా ఉన్నాయని తెగడడమే పని. అదేదొ పుష్కరాలు ప్రభుత్వ కార్యక్రమం అయినట్టు దాని మీద నానా రభస చేసింది మీడియా. పుష్కరాలకు హిందువులకు సంబంధించిన ఒక సంప్రదాయవేడుక. అది ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు. పుష్కరాల్లో ప్రభుత్వాలే కాక, ప్రజలు కూడా చాలా విశేష సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. ఎవరికి వారే కార్యకర్తలై, తమ ధర్మానికి చెందిన ఒక క్రతువును విజయవంతం చేయటానికి తమ వంతు కృషి చేశారు.

ఈ పుష్కరాల్లో ప్రజలు చేసిన కృషిని, వారి సేవను దాదాపు చాలా శాతం మీడీయా చూపించలేదనే చెప్పాలి. ఈ విషయాన్నే మిత్రులతో పంచుకున్నప్పుడు, పుష్కరాల్లో ప్రజల భాగస్వామ్యం గురించి, తమ ధర్మం పట్ల వారికి ఉన్న శ్రద్ధ, నిబద్ధత గురించి అందరికి తెలియజెప్తే బాగుంటుందని అన్నారు. హిందువుల దౌర్భాగ్యం ఏమంటే హిందువులు చేసిన ఏ మంచి పనిని పొగడటానికి మీడియాకు నోరు రాదు, కానీ ఏదో విధంగా ఎప్పుడూ ఎలా దాడి చెద్దామా అని కళ్ళలో వత్తులు వేసుకుని కూర్చుంటారు. మరి మన గురించి ఎవరూ చెప్పరా? చెప్పకపోతేనేం? మనమే చెప్పుకుందాం. అందుకే ఈ చిన్న ప్రయత్నం.






మొన్నే మేము కూడా పుష్కరాలకు వెళ్ళి పుష్కరస్నానం చేసి వచ్చాం. ఈ పుష్కరాలు చాలా మంచి అనుభూతులను పంచాయి. ప్రయణంలో జరిగిన ప్రతి సంఘటనా, ధర్మం యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపింది. హైద్రాబాదు నుంచి కొవ్వూరుకు రైల్‌లో ప్రయాణం చేశాం. విజయవాడ వరకు ప్రయాణం బానే సాగింది. సికింద్రాబాదులోనే రైలు సగం నిండిపోయింది. అర్ధరాత్రి సమయంలో విజయవాడ చేరింది. ఉదయం లేచు చూద్దును కదా, కాళ్ళ దగ్గర బ్యాగులు పెట్టుకుని జనం కూర్చుకున్నారు, మధ్య బెర్త్ నుంచి దిగి కింద కాళ్ళు పెడదాం అనుకుంటే అక్కడ కూడా ఎవరో దుప్పటి పర్చుకుని నిద్రపోతున్నారు. రైలు మొత్తం కిక్కిరిసిపోయింది. జనరల్ కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో రిజర్వేషన్ బోగీల్లోకి జనం వచ్చేశారు. బాత్రూంకి వెళ్ళే అవకాశం కూడా లేదు. కొందరు నిల్చునే నిద్రపోతున్నారు, కొందరు దారిలో కూర్చున్నారు. పసిపిల్లలని వెంటబెట్టుకుని వచ్చేశారు కొందరు. బాత్రూం దగ్గర కూడా కూర్చున్నారు చాలామంది.

బయట జోరున వాన. అందరూ ఎక్కిదిగటంతో కంపార్ట్‌మెంట్ అంతా చిత్తడి చిత్తడిగానే తయారయ్యింది. ఎక్కడపడితే అక్కడ సామనులు, బ్యాగులు పెట్టేశారు. రోజు ప్రయాణం చేసే సిటీబస్సు కిక్కిరిసి ఉండి, తెలియకుండా ఎవరి బ్యాగైన మీద పడితే నానా రభస చేసే జనం, అక్కడ అంత కిక్కిరిసి ఉన్నా, సామాన్లు ఎలా పడితే అలా పడేసి ఉన్నా, ఒకరి మీద ఒకరి పడిపోతున్నా, సహనం కోల్పోలేదు. ముగ్గురు కూర్చునే సీట్లో 5-6 మంది కూర్చున్నారు. రిజర్వేషన్ చేయించుకున్నవారు 'మేము మీకు సీటు ఎందుకివ్వాలి?' అని మిగితావారని ప్రశ్నించలేదు. రండి, కలిసి కూర్చుందాం అంటూ సీటు పంచుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. బయట వర్షం కురుస్తూ, లోపల తడిగా మారినప్పుడు సాధారణంగా చికాకు కలుగుతుంది. కానీ పుష్కరస్నానం కోసం వెళ్ళే యాత్రికుల్లో అసలు అసహనం కనిపించలేదు. అందరిలో ఏదో శాంత భావం, తెలియని ఆనందం మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రయాణం మొత్తం చాలా సరదాగా సాగింది. ధనిక పేద, కుల, ప్రాంత బేధాలు కూడా మరచి జనం ప్రయాణం చేశారు.

మామూలు రోజుల్లో రైలు గమ్యస్థానం చేరుకున్న తర్వాత జనం ఒకరిని ఒకరు తోసుకుని, సామాన్లు కిందపడేసుకుని నానా గొడవ చేసుకుంటారు, కానీ పుష్కర ప్రయాణంలో అలా ఎక్కడా జరగలేదు, ఎవరు తోసుకోలేదు. ఒకరి తర్వత ఒకరు నెమ్మదిగా దిగారు. పక్కవారి సామాన్లు దింపడంలో సాయం చేసుకున్నారు. పెద్దవయసు వారిని దగ్గరి ఉండి మరీ దింపారు. పోని ఇదంతా ఎవరైనా పోలీసులు చెప్పడం చేతనో, లేక ఎవరైనా ఉండి క్రమశిక్షణ నేర్పడం చేతనో వచ్చిన మార్పు కాదు. మొత్తం ప్రయాణం చేస్తున్నవారందరిలోనూ ఒకటే భావం, మేము పుణ్యస్నానానికి వెళుతున్నాం, మా ధర్మానికి సంబంధించిన ఒక ఉత్సవానికి వెళుతున్నాం, ఇది మాకు సంబంధించిన పండుగ.

ఇదంతా చూసి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, అంతకంటే ఎక్కువ ఆనందం కూడా కలిగింది. ఇంతమంది ఇంత వ్యతిరేకపరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ కూడా ఎక్కడ సహనం కోల్పోకుండా, సోదరభావంతో మెలిగారంటే ఇది మాత్రం ఖచ్చితంగా ధర్మ వైభవమే. ఎవరైనా ధర్మం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఇదే చెప్పాలనిపిస్తోంది. ప్రజల మధ్య ఐక్యతకు ధర్మమే కారణమన్న ఋషుల మాటకు ఇదియే నిదర్శనంగా కనిపించింది. ఇన్ని కోట్ల మంది ఒక చోటుకు చేరినా, ఏ విధమైన ఘర్షణ లేకపోవడం, వారి మధ్య సఖ్యతను పెంచేందుకు, గోడవలు కాకుండా నియత్రించేందుకు ఏ వ్యవస్థ లేకపోయినా, అందరు కలిసి సరదాగా ప్రయాణం చేయడం ధర్మం యొక్క గొప్పతనమే.

మిత్రుల సహకారంతో ఫొటో తీయడం జరిగింది.

To be continued ....................

No comments:

Post a Comment