Thursday 19 May 2016

వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి.

మే 20, శుక్రవారం, వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి.

హిరణ్యకశిపుడుని చంపటానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టడానికి శ్రీ మన్నారయణుడు నరసింహస్వామి రూపంలో వైశాక శుద్ధ చతుర్దశి నాడు అవతరించారు. సాధారణంగా నృసింహం అంటే సగం నరుడు, సగం సింహం అనే అర్దం చెప్తారు. కానీ తత్త్వంలోకి వెళితే జీవుల దేహాత్మ భావనను (ఈ శరీరమే నేను) అనే భావనను తొలగించే తత్త్వమే నృసింహ తత్త్వం. నరసింహస్వామి నమ్మకానికి, తక్షణమైన రక్షణకు ప్రతీక. అందరూ నృసింహ స్వామిని ఉగ్రస్వరూపం అంటారు కానీ ఆయన అందరికి ఉగ్రుడు కాదు. తాను ఈ దేహమే అనుకున్న భక్తుడికి ఆ భావన పోగట్టడంలో ఆయన ఉగ్రస్వరూపాన్ని చూపుతాడు.

హిరణ్యకశిపుడేమీ ధర్మం, శాస్త్రం తెలియని వాడు కాదు. వేదాంతం ఔపోసన పట్టాడు. అయినా బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, మరణం ఉండరాదని వరం అడుగుతాడు. అది కుదరదని, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని బ్రహ్మ చెప్పగా, తనకు మనిషి చేతిలో కానీ, జంతువు చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ మరణం ఉండరాదని, పగలు, రాత్రి, ఇంట్లో, బయట మరణం సంభవించకూడదని, ఆయుధాలు తనను ఏమీ చేయరాదని, ఆకాశంలో కానీ, భూమిపై కానీ మరణించకూడదని, ఇలా అనేక విషయాలను వరం అడుగుతాడు. సరేనంటాడు బ్రహ్మ. తనకు ఇక మరణం లేదని, విర్రవీగి యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేస్తాడు. తానే దేవుడినని, తననే పూజించమని ఆజ్ఞ ఇస్తాడు.

వేదాంతాన్ని కంఠస్థం చేయడం కాదు కావల్సింది, దాన్ని జీర్ణించుకుని, దానికి అనుగుణంగా జీవించాలి. మనిషి ఎంత గొప్పవాడైనా, సృష్టిని గురించి ఎన్ని రహస్యాలను తెలుసుకున్నా, ఈ సృష్టిని, తనను సృష్టించినవాడు ఒకడున్నాడని, వాడు మనకంటే గొప్పవాడని, సర్వజ్ఞాని అని, సర్వాంతర్యామి అని స్థిరమైన భావన ఉన్నవాడే వివేకవంతుడు. హిరణ్యకశిపునికి ఆ వివేకం లోపించింది. తానే దేహం అనుకున్నప్పుడు, దాన్ని నిలుపుకోవటానికే ప్రయత్నిస్తారు కానీ సత్యం తెలుసుకోరు. అలాంటివాడిని సంహరించటానికి వచ్చినవాడే నృసింహుడు.

సగం మనిషి, సగం సింహం రూపంలో, తన గోర్లనే ఆయుధంగా చేసుకుని, పగలు, రాత్రికి సంధికాలమైన సంధ్యాసమయంలో, ఇంట్లోనూ కాక, బయట కాక, ఇంటి గడప మీద, నేల మీద కాక, ఆకాశంలో కాక, తన తొడల మీద పెట్టుకుని హిరణ్యకశిపుని సంహరించాడు నారసింహుడు. అసాధ్యమనుకున్నది కూడా విష్ణువు తల్చుకుంటే సుసాధ్యమవుతుందని చెప్తుందీ కధ.

లక్ష్మీనరసింహస్వామికి ప్రీతికరంగా కొందరు భక్తులు నృసింహ జయంతి రోజున ఉపవాసం చేస్తారు. స్వామికి వడపప్పు, పానకం నివేదన చేయడం శ్రేయస్కరం. అసలేమీ చేయలేకపోయినా, కేవలం ఒక్క నమస్కారం హృదయపూర్వకంగా చేసుకున్నా, స్వామి అనుగ్రహం లభిస్తుంది. నరసింహ స్వామి స్తోత్రాలు పఠించడం, అవి రాకపోతే ఓం నృసింహాయ నమః/ ఓం నారసింహాయ నమః అని జపించడం ఉత్తమం. అది కూడా చదవడం రాకపోతే కనీసం 'జయ నరసింహ, జయ జయ నరసింహ' అని నామం చెప్పుకున్నా అంతే ఫలితం వస్తుంది. స్తోత్రం చదివామా? మంత్రం చేశామా? నివేదన చేశామా? అన్నది ఈశ్వరుడు చూడడు. నిర్మలమైన మనసుతో ఆయన్ను హృదయంలో ధ్యానించామా లేదా అన్నదే చూస్తాడు. ఈ పూజలన్నీ మన చిత్తశుద్ధి కొరకే కనుక వీలున్నవాళ్ళు అలా చేయవచ్చు.

నృసింహ స్వామిని సాయం సంధ్యావేళ ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి.

జయ సింహ జయ నరసింహ
జయ జయ ప్రహ్లాద వరదా లక్ష్మీ నృసింహ 

No comments:

Post a Comment