Wednesday 11 May 2016

శంకరభగవత్పాదుల గురువుగారి మఠం

శంకరభగవత్పాదుల గురువుగారి మఠం.

శంకరాచార్యుల దీక్షా గురువుగారు గోవిందా భగవత్పాదులవారు. వారిని ఆదిశంకరులు నర్మదా నదీ తీరంలో కలుసుకున్నారు. ఆ గోవింద భగవత్పాదుల గురువులు (అనగా శంకరులకు పరమగురువులు) గౌడపాదాచార్యుల వారు. శంకరాచార్యులు మఠాలను స్థాపించిన సమయంలోనే, గోవింద భగవత్పాదుల శిష్యుడు స్వామి వివర్ణానంద గౌడపాదాచార్య మఠం అనే మఠాన్ని స్థాపించారు. ప్రస్తుతం అది గోవా రాష్ట్రాంలో ఉంది. దీన్ని ఒకప్పుడు కైవల్య మఠమని అనేవారట. కంచి మఠం పరంపరలో ఈ విషయం కనిపిస్తుంది. ఇప్పుడు దీని కవలో మఠ్ అని సంబోధిస్తున్నారు. శంకరుల కాలమానం గురించి వీరి పరంపర స్పష్టంగా చెప్తోంది. కలియుగం 2593 (క్రీ.పూ. 509) సంవత్సరంలో శంకరులు జన్మించారు. క్రీ.పూ. 482 లో కంచిమఠాన్ని స్థాపించారు. ఆ సమయంలోనే ఈ మఠం కూడా స్థాపించబడిందని ఇక్కడ వారు చెప్తున్నారు.

చరిత్రలో ఈ మఠం ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. 14, 15 శతాబ్దాల్లో గోవా మీద వ్యాపారం ముసుగులో విరుచుకుపడ్డ పోర్చుగీస్ క్రైస్తువులు, ఇక్కడి హిందువులను ప్రపంచంలోనే అత్యంత కౄరంగా హింసించి, మతమార్పిడులకు ఒడికట్టారు. ఈ హత్యాకాండ మానవ చరిత్రలో Goa Inquisition పేరుతో నిలిచిపోయింది. దేవాలయాలను ధ్వంసం చేశారు. 1564 లో కేలోషి మఠాన్ని ధ్వంసం చేశారు. తమ పరంపరను రక్షించుకోవడానికి అప్పటి 57 వ పీఠాధిపతి పూర్ణానంద సరస్వతీ శ్రీ గౌడపాదాచార్యులవారు ఈ మఠాన్ని గోల్వన్ మఠానికి తరలించారు. అటు తర్వాత ఈ మఠాధిపతులు వారణాశికి తరలివెళ్ళారు. 63 వ పీఠాధిపతి మళ్ళో గోవాకు తరలివాచ్చారు.

అటు తర్వాత 1630 లో గోవాలో హిందూ రాజ్యంలో ఇప్పుడున్న మఠాన్ని నిర్మించి, ధర్మప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆదిశంకరులు స్థాపించిన మఠాలతో పాటు అంతే ప్రాచీనత కలిగిన మఠం ఇది. ప్రస్తుతం 77 వ పీఠాధిపతిగా శ్రీ శివానంద సరస్వతీ స్వామి గౌడపాదాచార్యులవారు ఉన్నారు.


శంకరుల గురువుల మఠం గురించి తెలుసుకోవడం చాలా అనదంగా ఉంది కదూ.

జయ జయ శంకర హర హర శంకర

http://www.shrikavalemath.org.in/history.htm

No comments:

Post a Comment