Monday 16 May 2016

హిందూ ధర్మం - 209 (యజ్ఞంలో బలి ఖండన - 3)

ఇప్పుడు వేదంలో యజ్ఞాల గురించి, అవి జంతుబలిని ఎలా ఖండించాయో చూద్దాం. వైదిక కర్మకాండకు ముఖ్యమైనది యజుర్వేదం. యజుర్వేద పండితుడిని అధ్వర్యుడు అంటారు. అధ్వర అంటేనే అహింస అని అర్దం. హింసకు పాల్పడనివాడని. ఇక ఆయన ఆధ్వర్యంలో జరిగే యజ్ఞంలో హింస ఎలా ఉంటుంది?

'వెజిటేరియనిజం అండ్ ది వేదాస్' అనే పుస్తకంలో అరుణబ్ తల్వార్ గారు ఇటువంటి అనేక విషయాలు చరించారు. యజ్ఞం జంతుబలిని కోరలేదు. మనిషిలో పశులక్షణాలను మాత్రమే బలి కోరింది. దీనికి సంబంధించిన అంశాన్ని కధ రూపంలో శతపధ బ్రాహ్మణం (1-2, 3, 6-9)లో ఋషులు పొందుపరిచారు. ఆదిలో (ఈ సృష్ట్యాదిలో) దేవతలను మనిషిని యజ్ఞంలో అర్పించారు. వెంటనే మేధ (ఆహుతివ్వాల్సిన వస్తువు), మరణించిన ఆ వ్యక్తి నుంచి వెళ్ళి, అశ్వంలోకి చేరింది. వాళ్ళు అశ్వాన్ని అర్పించారు. అప్పుడు మేధ ఆవులోకి ప్రవేశించింది. వారు ఆవును అర్పించారు. అప్పుడది మేకలోకి ప్రవేశించింది. వారు మేకను కూడా అర్పించారు. అప్పుడు మేధ భూమిలోకి ప్రవేశించింది. మేధను వెతుకుతూ దేవతలు భూమిని తవ్వగా, అది బియ్యం, బార్లో లోకి దాక్కుంది. వాటిని యజ్ఞంలో అర్పించినా, వాటి నుంచి మేధ ఎక్కడకు వెళ్ళలేదు. యజ్ఞ ఫలితానిచ్చింది. కనుక బార్లీ, బియ్యం మొదలైనవి మాత్రమే హవిస్సుకు (యజ్ఞంలో ఆహుతిచ్చే పదార్ధాలను హవిస్సు అంటారు) శ్రేష్టమని తేల్చారు. ఇక్కడొక విషయం గమనించాలి. బ్రాహ్మణాలు వేదానికి (మంత్రసంహిత) వేదద్రష్టలైన ఋషులు ఇచ్చిన బాష్యాలు. అవి ప్రసాదించక ముందు ఏ విధమైన యజ్ఞయాగాది క్రతువులు జరగలేదు. ఎందుకంటే యజ్ఞ ప్రక్రియలను ఋషులే వెలికి తీశారు కనుక. అందువల్ల బ్రాహ్మణంలో చెప్పిన కధ కేవలం సూచకంగానే (symbolic) గ్రహించాలి కానీ, ఐతిహ్యం (Historical event) గా కాదు.

యజ్ఞంలో చెఱువు అన్న పేరుతో హవిస్సు వేయడానికి అన్నం వండుతారు. అది మాములు పద్ధతికి భిన్నంగా ఉంటుంది. అదే కాక కొన్ని యగాల్లో ఆ చెఱువులోనే బార్లీ గింజలు, నవధాన్యాలు కలుపుతారు. యాగం ఏ కారణం నిమిత్తం చేయబడుతున్నదో, దానికి తగిన వస్తువులను అందులో కలుపుతారు. కొన్ని సందర్భాల్లో నవధాన్యాలను పొడి చేసి, హవిస్సుగా అర్పిస్తారు. ఈ చెఱువులోనే పెరుగు, తేనే కలిపి కూడా అర్పిస్తారు. ఇవన్నీ మానవునిలో పశుత్వ లక్షణాలను ఆహుతివ్వడానికి సూచనలు. కొన్ని పెద్ద పెద్ద యాగల్లో మేకబలి ఇస్తారని వక్రీకరించారు. పరాశర మహర్షి పిండితో చేసిన మేకను బలి ఇవ్వాలని తన గ్రంధాల్లో స్పష్టంగా వెల్లడించారు. ఆ పిండి మేక మనిషిలోని పశులక్షణానికి, బద్ధకానికి సూచన. మహిషాసుర మర్ధిని మహిషుడిని మర్దించడమంటే దున్నపోతును చంపడం కాదు. మానవునిలోని మహిషత్వాన్ని, జడత్వాన్ని, నీచమైన పశుస్వభావాన్ని మర్దించడం.

To be continued .....................

No comments:

Post a Comment