Friday 8 January 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (138)



రాఘవ చైతన్యుడనే ఒకాయన, మహా గణపతి స్తోత్రం వ్రాసేరు. అందు మంత్ర శాస్త్ర రహస్యాలే కాదు, కవిత్వపు సొగసులూ ఉన్నాయి. అతడు చెవులనాడించడం, తుమ్మెదలను గెంటివేస్తూన్నట్లు ఆటలాడుకోవడాన్ని వర్ణించాడు.


తానా మోదవినోదలుబ్ధ మధుపప్రోత్పారణావిర్భావతః  

కర్ణాందోళనభేలనో విజయతే దేవోగణ గ్రామణీ


చెక్కిళ్ళపై మదం కారేటపుడు వచ్చే సుగంధాన్ని తానామోదం అంటారు. ఆ సువాసనకు తుమ్మెదలు మూగాయి. ఆ మదాన్ని త్రాగాలని అనుకున్నాయి. లోభంతో ఉన్నాయి. 'లుబ్ధమధుప'. లేదా ఆ సుగంధాన్ని ఆస్వాదించడంలో తమను తామే మరిచిపోయాయి. 


స్వామి వాటిని తరమాలని అనుకున్నాడు. అనగా ప్రోత్సారణం. అందుండి ఒక ఆట పుట్టింది. అనగా ఖేలనం. ఏమిటా క్రీడ? కర్నాందోళన ఖేలనం, అంటే చెవులను అటూ ఇటూ కదపడం. ఆ ఊపు ఆందోళన స్వామిని ఊయెలలో పెట్టి అటూ ఇటూ ఊపుతూ ఉంటారు. అదే డోలోత్సవం.


తుమ్మెదలను తరిమే స్వామి ఇంకా అందంగా ఉన్నాడట. బాగా ప్రకాశిస్తున్నాడట. 'విజయతే' గెలిచిన వాని మాదిరిగా నాయకునిగా ఉన్నాడట. మూగే తుమ్మెదలను గెంటివేసి గెలిచాడు కదా.

No comments:

Post a Comment