Thursday 15 January 2015

సంక్రాంతి నాడు తప్పనిసరిగా నువ్వులు, బెల్లం తినాలి

సంక్రాంతి నాడు తప్పనిసరిగా నువ్వులు, బెల్లం తినాలి. దీని వెనుక ఆయుర్వేదరహస్యం ఉంది. నువ్వులు చలికాలంలో శరీరంలో ఏర్పడిన వాత దోషాన్ని తగ్గిస్తాయి. బెల్లం నువ్వుల తినడం వలన పైత్య దోషం కలగకుండా చేస్తుంది. అందుకే సంక్రాంతి నాడు తెలుగు వాళ్ళు అరిసెలు చేసుకుని తింటారు. తీపి తినండి, తియ్యగా మాట్లాడండి. 
సంక్రాంతి పండుగకు గడపకు వరి, జొన్న కంకులను కడతారు.

దీని వెనుక జీవ వైవిధ్యాన్ని రక్షించాలన్న సందేశం ఉంది. పోలాల్లో పంట కాపుకు వచ్చే సమయంలో, రకరకాల పక్షులు, పిట్టలు ఆ ఆహారం కోసం అ పంట మీద పడతాయి. అప్పుడు వాటిని రైతు వెళ్ళగొడతాడు. అవి జీవవైవిధ్యంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మన జీవనానికి ఈ భూమి మీద ఉన్న ప్రతిజీవి ఏదో ఒక విధంగా సహాయపడుతుంది. వాటి కృతజ్ఞతగా, ఆనాడు వాటికి ఆహారం దక్కకుండా వెళ్ళగొట్టినందుకుగాను పంట చేతికోచ్చాక ఇంటి గుమ్మాలకు వరి కంకులు కట్టి, వాటికి ఆహారం అందించేవారు మన పూర్వీకులు. అవి గుమ్మాల దగ్గరకు వచ్చి తింటే రైతు ఆనందిస్తాడు. ఏ జీవవైవిధ్య సదస్సులు జరగని రోజుల్లోనే, ప్రపంచానికి పర్యావరణాన్ని పరొరక్షించాలన్న స్పృహ లేని రోజుల్లోనే సనాతాన భారతీయులు(హిందువులు) ప్రకృతి రక్షణ కోసం తీస్కున్న చర్యలు. ఇది ఒకనాటి మాట అయిపొయింది.

ఇప్పుడు సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా పిచ్చుకల జాతి అంతరించిపోతోంది. పల్లే పట్నం బాట పట్టింది. మనకైతే ప్రకృతిని దోచుకోవడం తప్ప, కాపాడుకోవాలన్న ఆలోచన చస్తే రాదు.మహర్షుల వారసులం మనం. వాళ్ళ పేరు నిలబెట్టాలి కద. అందుకే కనీసం ఈ సంక్రాంతి నుండైనా మన ఇంటి గోడ మీద పక్షులకు చిన్న మట్టి ముంతలో నీరు పెడదాం. పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. 


సంక్రాంతి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment