Saturday 17 January 2015

ఒంగోలు గిత్త ప్రమాదంలో ఉంది

సంక్రాంతి అనగానే గుర్తుకువచ్చేది ఆవు, ఎద్దు. పశువులు మనకు చేస్తున్న సహాయానికి నిదర్శనంగా కనుమ అనే ఒక ప్రత్యేకమైన రోజును వాటికి కెటాయించి, వాటిని పూజిస్తుంది హిందూ సంస్కృతి. ఎద్దు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఒంగులు గిత్త. అటువంటి ఒంగోలు గిత్త ప్రమాదంలో ఉంది. కళ్ళు తెరవకపోతే, తర్వాతి తరాలకు పుస్తకాల్లో చూపించవలసి వస్తుందేమో.

ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 50-60 ఏళ్ళ కిందట బ్రెజిల్ వారు భారతదేశం నుంచి ఒంగోలు జాతి గిత్తలను చాలా తక్కువ ధరకు (కొన్ని వేలకు) కొని తీసుకువెళ్ళారు. తర్వాత అక్కడ వాటిని పెంచి సంతతిని వృద్ధి చేశారు. అదే సమయంలో భారతదేశంలో మేలు జాతి గిత్తలను అనవసరమైనదిగా భావించి కబేళాలకు తరలించి, మాంసం అమ్ముకున్నారు. ఈ మధ్య మన రైతు ఒకసారి బ్రెజిల్ వెళ్ళినప్పుడు, అక్కడ మేలుజాతి ఒంగోలు గిత్తలుండడం చూసి, వాటిని గురించి ఆరా తీసారు. వాటి ధర కౌక్కోగా, అక్కడ కనీసం 50 లక్షలు పెడితే కానీ, ఒంగోలు గిత్త దొరకదని తెలుసుకుని, మన దేశంలో వాటి పరిస్థితిని చూసి దుఃఖిస్తూ తిరిగి వచ్చారు. అటువంటి ఒంగోలు గిత్త గురించి ఒక ఆంధ్రప్రభలో పత్రికలో వచ్చిన వ్యాసం చదవండి.

మనం మరచినా రచ్చగెలుస్తున్న ఒంగోలు గిత్త: శారీరక బలం, సామర్థ్యాలలో దీనికి మించిన జాతి లేదు. ప ట్టుదలకు పెట్టింది పేరు. అందచందాలలో దీనికిలేదు సా టి. ఆప్యాయత, అనురాగాలు పంచటంలో దానికదే మేటి. ఉల్లాస ఉత్సాహాలు దీని సొంతం. యజమానికి సేవ చేయడమే దీని జీవన సూత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రైతులకు ఇది ఆత్మబంధువు. అదే ఒంగోలుజాతి. ఒంగోలు గిత్త పేరు వినగానే మన కళ్ల మం దు ఎతైన మూపురంతో, పెద్ద గంగడోలుతో, సౌందర్యం, రాచఠీవి ముప్పిరిగొన్న ఒక నిండైన విగ్రహం మనకళ్ళ ముందు కనపడుతోంది. ఇంటి చంటి బిడ్డ తన రొమ్ము కుడిచినా, గంగడోలుతో ఆడుకొన్నా, మురిపెంతో చూసే ప్రేమ తత్వానికి ప్రతీక ఒంగోలు జాతి ఆవు అయితే, ఇంటి యజమాని కాలం చెందితే, దిగులుతో ఆహారం స్వీకరించకుండా ఆత్మత్యాగం చేసే విశ్వాసం ఒంగోలుజాతి గిత్తది. ఒంగోలు జాతి పశుసంతతి అందచందాలు ఎంత సేపు చూసినా తనివి తీరదు.

ఒంగోలు జాతి పుట్టు పూర్వోత్తరాలు :

ప్రపంచంలోని అన్ని జీవజాతుల మాదిరిగానే ఒంగోలు జాతి పశుసంతతికి వాటి స్వస్థలమే పేరుగా ఉండిపో యింది. వాటి పుట్టినిల్లు నెల్లూరు జిల్లా ఒంగోలు తాలూ కా గుండ్ల కమ్మ నది పరివాహక ప్రాంతం. ఒంగోలు జిల్లా ఏర్పడక ముందు ఒంగోలు తాలూకా నెల్లూరు జిల్లాలోనే ఉండడంతో ఈ జాతి అంతర్జాతీయంగా నెల్లూరు జాతి (నెల్లూరు బుల్స్‌ ) గానే ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం ఈ జాతి క్షీణదశలో ఉన్నప్పటికి మన రా ష్ట్రంలో కొన్ని జిల్లాల్లో యజమానులు తమ బిడ్డల కన్నా మిన్నగా వీటి పట్ల శ్రద్ద వహించడం వలన ఈ జాతి పశువుల్లో మేలైనవి ఇంకా మిగిలి ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా పలు జిల్లాల్లో ఇప్పటికీ జరిగే బండలాగుడు పోటీలలో ఒంగోలు జాతిదే ప్రధాన స్థానం. చాలా జిల్లాల్లో రైతుల ఇంటి వాకిట్లో, చింతపట్ల సుబ్బారా వుగారి ఎడ్లు, పెనుబల్లి వారి ఎడ్లు అంటూ వారి ఎడ్ల బొమ్మలతో ఇంటి గుమ్మాలకు అలంకరించిన చిత్ర పటా లను మనం చూడ వచ్చు. ఒంగోలు జాతి పశువు రైతు లకు గొప్ప నేస్తం. యజమానులను ఎంత కాలం తర్వాత అయినా గుర్తించి ప్రేమను ఒలకబోయడం వీటి విశ్వాసతత్వానికి ప్రతీక.

ఒంగోలు జాతికి అన్నీ ప్రత్యేకతలే ..

బాస్‌ ఇండికస్‌ జాతికి చెందిన ఒంగోలు ఆవులను, గిత్తలను పోలినవి, వాటికి పోటీ రాగలవి మనదేశంలోనే కాదు, భూమండలంపైన మరెక్కడా లేవు. అందుకే అన్ని దేశాల కన్ను దీనిమీద పడింది. ఫలితంగా ఈ జాతి మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ఖండాల్ని దాటి ప్రపంచ దేశాలకు తన వారసుల్ని అందించింది. అంతర్జా తీయ పశుజాతి చరిత్రలో తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింప చేసింది. మనం నిర్లక్ష్యం వహించినా దీని విశిష్టతలను గుర్తించిన విదేశీయులు దీనిని అక్కున చర్చుకున్నారు. విదేశాలలో బ్రెజిల్‌ ఈ జాతిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఒంగోలుజాతి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడుతుండడం గమ నార్హం. ఆ దేశాలలో కేవలం మాంసం కొరకే వాటిని ఉత్పత్తి చేస్తారు. ఒంగోలు జాతి పశువులు శారీరక సా మర్థ్యం, రోగనిరోధక శక్తి, సంతాన సాఫల్యత, ప్రతికూల అంశాల్ని కూడా తట్టుకోగల చరిత్ర కారణంగా ఇవి ప్రాచుర్య పొందాయి. ఒంగోలు ఆవులకు మంచి సంతాన సాఫల్యత ఉంది. కడుపులో ఉన్నప్పుడు లేగదూడలు పెద్దగా బరువు లేకుండా ఉండడం వీటిలో సంతానోత్పత్తి అధికంగా ఉండడానికి ఒక కారణం. లేగదూడల్లోనూ చురుకుదనం అధికమే. పుట్టిన కొద్ది క్షణాలకే చెంగు చెంగున గెంతులేస్తూ ముచ్చట గొల్పుతాయి. ఒంగోలు జాతి ఆవులు సరైన పోషణ ఉంటే మూడు సంవత్సరాలకే మొదటిసారి ఈనుతాయి. ఒక ఆవు ఈతలో వెయ్యి లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాలలో కూడా మిగిలిన పశుజాతులతో పోలిస్తే రోగనిరోధక శక్తి అధికంగా ఉండడం ఈ జాతి ప్రత్యేకత. ఒకప్పుడు మన రాష్ట్రంలో పశుసంపద ఎక్కువగా ఉండేది. మారుతున్న పరిస్థితుల్లో రైతులు పశుసంపదపై దృష్టి తగ్గించడంతో తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో ఒంగోలుజాతి పరిర క్షణ కొరకు ప్రకాశం జిల్లా చింతదీవి వద్ద ఫారం ఏర్పా టు చేసినా పాలకుల, అధికారుల అశ్రద్ద వలన అది పూర్తి స్థాయిలో పని చేయక పోవడం విచారకరం. ఉన్న కొద్దో గొప్పో ఒంగోలు జాతి పశువులు కూడా యజమానుల వ్యక్తి గత శ్రద్ద వలననే బ్రతికి బట్ట గడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు కళ్ళు తెరచి ఈ జాతి పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి రక్షించక పోతే, మన ముందు తరాల వారు ఈ జాతి కోసం విదేశాలవైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదని పశుశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొసమెరుపు ..

హిందూ సాంప్రదాయంలో పశుసంతతికి పూజ్యనీయమైన స్థానం ఉంది. గోవుని మనం పూజిస్తాం. వృషభాన్ని పరమశివుని వాహనంగా సేవిస్తాం. మన దేశంలో గోవధ నిషేధచట్టం ఉన్నా, ఆచరణలో పాలకులకు చిత్తశుద్ధి లేక పోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం. మనం నిర్లక్ష్యం వహించినా విదేశాలకు వెళ్లిన ఒంగోలు జాతి, మన దేశఖ్యాతిని చాటి చెపుతున్నందుకు ఆనంద పడాలా, విదేశాలలోని వారికి, ఆ దేశాలలో ఉన్న మన వారికి కూడా ఆహారం అయిపోతుంటే బాధపడాలా తేల్చుకోవాల్సింది మనమే. ఒంగోలు జాతికి మనం రుణపడి ఉన్నాం. కానీ ఆ జాతి మనకు రుణపడి లేదు, కాబోదు. మనమే కళ్ళు తెరచి ఆ జాతిని సంరక్షించుకోవాల్సి ఉంది.

Source: http://www.prabhanews.com/prakasham/article-403494

No comments:

Post a Comment