Tuesday 6 January 2015

హిందూ ధర్మం - 128 (ఉపనిషత్తులు)

ఉపనిషత్తులు ప్రధానంగా ఆత్మ గురించి, మరణం గురించి, సృష్టి పట్ల. సర్వజీవుల పట్ల మనిషికి ఉండాల్సిన ధృక్పధం గురించి వివరిస్తాయి. భగవంతుడు శాశ్వతమైనవాడు, ఎప్పటికి ఉండేవాడు, పరిమితులు లేనివాడు, మాటలకు, వర్ణనలకు అతీతమైనవాడు. అటువంటి పరమేశ్వరుడిని చర్మ చక్షువులతో (బాహ్య నేత్రాలతో) చూడటం దాదాపు కష్టం. ఎందుకంటే శరీరం నశ్వరమైనది, ఈ రోజు ఉంటుంది, రేపు నశించిపోతుంది. అలా అని మనసుతో కూడా చూడలేము, ఎందుకంటే మనసుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని దాటి మనసుపోలేదు. కానీ భగవత్ తత్వాన్ని అర్దం చేసుకోవాలన్నా, భగవంతుని చూడాలన్నా, అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం. దానికి కారణం ఆత్మ కూడా పరమాత్మ వలె శాశ్వతమైనది, మార్పు చెందనిది. నిత్యం సుఖాన్ని కోరుకోవడం మనిషి యొక్క లక్షణం. కానీ ఈ ప్రపంచంలో ఒక వింత ఉంది. సుఖదుఃఖాలు ద్వందాలు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. రెండిటిలో దేన్నీ కోరుకున్నా రెండవది వెనుకే వస్తుంది. మనిషి ఈ రోజు కోట్ల ఐశ్వర్యంతో సుఖంగా ఉన్నాడని అనుకోవచ్చు, కానీ ముసలి వయసు రాగానే ఆ ఆస్థుల యందు, ధనం యందు పెరిగిపోయిన బంధమే దుఃఖానికి కారణమవుతుంది. ఈ రోజు నీకు ఏది సుఖం ఇచ్చిందో, రేపు అదే నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వయసులో ఉన్నప్పుడు నోటికి తాళం వేయరు. ఉదాహరణకు ఒక సమయం ఉండదు, నచ్చినవన్నీ ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఆహారనియమాల పాటించని కారణంగా కాస్త పెద్దవయసు రాగానే ఏదో ఒక రోగం వస్తుంది. డాక్టర్ కొన్ని తినవద్దు అని చెప్తాడు. అప్పటివరకు నోటికి అలవాటైన రుచులు ఒక్కసారిగా అందకపోయేసరికి ముద్దు నోట్లోకి దిగదు, దాంతో మనసు తీవ్రంగా క్షోభిస్తుంది. వచ్చిన రోగం కంటే ఈ మానసిక క్షోభయే అధికంగా ఉంటుంది. అందుచేత మనిషి సుఖదుఃఖాలకు అతీతంగా అదగాలి. అంటే సుఖదుఃఖాలను పట్టించుకోకపోవడం కాదు, పారిపోవడం కూడా కాదు. సుఖదుఃఖాలు రెండూ, మనసుకు కలిగే భావనలు. ఈ మనసుకు అతీతంగా ఎదిగినప్పుడు మనిషి అన్ని రకాల బాధలు, కష్టాల నుంచి విడువడుతున్నాడు. ఆ ఎదుగుదల గురించి ఉపనిషత్తులు వివరిస్తాయి. ఉపనిషత్తులు గురుశిష్య సంవాద రూపంలో ఉంటాయి. శిష్యుడు అడిగిన ప్రశ్నకు గురువు సమాధానం చెప్తాడు.

ఆత్మ అంటే ఏంటి? ఆత్మ కళ్ళకు కన్ను వంటిది, చెవులకు చెవి వంటిది, నోరుకి నోరు వంటిది. ఒక దీపం వెలిగించి దాని మీద అనేక చిల్లులు కలిగిన కుండను బోర్లించి పెడితే, ఆ చిల్లుల ద్వారా కాంతిపుంజాలు ఏ విధంగా బయటకు పరసరిస్తాయో, అదే విధంగా ఆత్మ యొక్క చైతన్యం వల్లనే శరీరంలో కదలికలు, ప్రాణం ఉంటాయి. నిత్యం జీవితంలో గమనిస్తే చాలా మంది మరణించినప్పుడు చూడటానికి వెళుతుంటాం.  అక్కడున్న అందరూ ఏడుస్తుంటారు, కొందరేమో అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు, పిల్లలేమో 'నాన్నగారు నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నారండి. కానీ ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిపోయింది. మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారండి' అంటూ దుఃఖిస్తారు. వెళ్ళిపోవడమేమిటి? ఇంకా శరీరం వాళ్ళ కళ్ళముందే ఉంది. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఒక పేరుకో, బంధుత్వానికో పలికిన ఆ దేహం ఇప్పుడు ఎన్ని విధాలుగా పిలిచినా స్పందించడం లేదు. మరి ఎక్కడికో వెళ్ళిపొవడమేమిటి? ఇంతకీ అక్కడి నుంచి పోయింది ఎవరు? కదలకుండా పడి ఉన్న దేహం ఎవరు? అతనే కనుక దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? ఆ శరీరం నుంచి వెళ్ళిపోయిన చైతన్యానికే ఆత్మ అని పేరు.    

To be continued .......................

No comments:

Post a Comment