Wednesday 14 January 2015

సంక్రాంతి - పెరుగు దానం

సంక్రాంతి రోజు తప్పకుండ చేయవలసిన దానం ఏమిటి?

సంక్రాంతి రోజు తప్పకుండ పెరుగు దానం చేయాలి. పెరుగు దానం చేయడం వలన సంతానసౌఖ్యం కలుగుతుంది. అధితి కశ్యపులకు శ్రీ మహావిష్ణువు వామనుడిగా జన్మించగానే పెరిగి 6 ఏళ్ళ బాలుడయ్యడు. వారికి సంతాన సౌఖ్యం కలుగలేదు. మరుజన్మలో శ్రీ రాముడిగా విష్ణువు, కౌసల్య, దశరధులుగా అధితికస్యపులు జన్మించారు. కాని రాముడు వనవాసానికి వెళ్ళడం, ఆ బాధతో దశరధుడు మరణించడం, కౌసల్య నువ్వు పుట్టపొయినా బాగుండును అని రాముడిని అనడం జరిగింది. వారికి అప్పుడు కూడ పుత్రసౌఖ్యం లేదు.

కృష్ణవతారంలో అధితికశ్యపులు దేవకి,వసుదేవులుగా జన్మించగా, పుట్టగానే వారికి దూరమైనాదు కృష్ణుడు. వారికి సంతానసౌఖ్యం లభించలేదు. కృష్ణుడికి కూడా సంతానం కలిగినా వారి వల్ల ఆయనకు సంతాన సౌఖ్యం కలుగలేదు, వారికి గొప్ప పేరు కూడా రాలేదు. యశోద పెరుగు దానం చెసింది. అందుకే శ్రీకృష్ణపరమాత్మ వలన సంతానసౌఖ్యం పొందింది. ఇందులో నందుడు పాలుపంచుకోలేదు కనుక ఆయన కృష్ణతత్వాన్ని అనుభవించలేకపోయాడు. అందువల్ల సంక్రాంతి రోజు పెరుగు దానం చేయడం వలన సంతానం వల్ల సుఖం, ఆనందం కలుగుతుంది. సంతానం కలిగినవారు పెరుగు దానం చేయడం వలన పుట్టిన సంతానానికి సద్బుద్ధి కలుగుతుందని డా.సి.వి.బి.సుబ్రహ్మణ్యం గారు చెప్పారు.

అలాగే సంక్రాంతి రోజున కూష్మాండం(గుమ్మడి కాయ) దానం చేయాలి.  ఏది దానం చేస్తున్న మన గుర్తుపెట్టుకోవలసినవి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాటలు. శ్రీ కృష్ణపరమాత్మ అంటారు " ప్రత్యుపకారము (ఇచ్చినదానికి ఫలితం, ఇవ్వడం వలన నాకేమి వస్తుంది) ఆశించకుండా, తగిన ప్రదేశంలో, తగిన కాలంలో, తీసుకునే వారి పాత్రతను (అవసరం ఉన్నవారికే దానం చేయాలి, రోగులకు ఔషధము, చదువుకునే ప్రజ్ఞ ఉండి ధనం లేని కారణంగా విద్యాభ్యాసం ఆపేసినవారికి విద్యాదానం, బీదవారికి ధనం, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇలా....) అనుసరించి ఆ దానాన్ని సాత్విక దానం అంటారు. నేను ఇస్తున్నాను అన్న గర్వం ఉండకూడదు. గొప్పతనం చూపించడానికి చేయకూడదు." ఇటువంటి దానం గొప్ప ఫలితానిస్తుంది.

No comments:

Post a Comment