Saturday 24 January 2015

భారత్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు

ఏదో అద్భుతం జరగబోతున్నట్టు మీడియా తెగ హల్‌చల్ చేస్తోంది. ఒబామ కారు ఎలా ఉంటుంది, ఆయన భార్య ఎలాంటి దుస్తులు ధరిస్తుంది, భధ్రతకు ఎంత ఖర్చవుతుందంటూ ప్రోగ్రాంలు వేస్తోంది తప్పించి, ఆ పర్యటన భారత్‌కు లాభమా? నష్టమా? అని చెప్పడంలేదు. నిజానికి ఒబామా పర్యటన వలన లాభం చేకూరేది అమెరికాకి మాత్రమే. నష్టపోయేది మాత్రం భారతే. అసలు అమెరికా ఏదైనా దేశంతో ఒప్పందం చేసుకుందంటే, అక్కడ అమెరికాకు ఏదో ప్రయోజనం ఉంటుంది. అవతలిదేశాలను బలహీనపరిచి, బ్రతికే అమెరికా భారత్ అభివృద్ధికి దోహదపడుతుందనుకోవడం కల్ల. ఒకప్పుడు ఆయుధతయారీ రంగంలో ఉండే కంపెనీలు తర్వాత వ్యవసాయరంగంలోకి ప్రవేశించాయి. బీటీ విత్తనాలు, పేటెంటులు, రసాయన ఎరువులంటూ అంటూ ఆహారభధ్రతను కాలరాస్తూ, విత్తనాలపై గుత్తాధిపత్యం సంపాదించి ఆహారాన్ని, తద్వారా ప్రపంచాన్ని అదుపు చేయాలని పన్నాగం పన్నాయి అమెరికా ప్రభుత్వం, అక్కడి బహుళజాతి సంస్థలు. దానిలో భాగంగా ఇంతకముందు భారత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నా, అవి పూర్తిగా అమెరికాకు లాభం చేకూర్చేలా లేవు. కనుక ఇప్పుడు ఆ విత్తనాల విషయంలో ఉన్న మిగిలిన అడ్డంకులు/ఆంక్షలు కూడా పూర్తిగా తొలగించుకోవాలని అమెరికా యత్నిస్తోంది. ఈ విషయంలో భారతప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోంది. ఒకవేళ అటువంటి ఒప్పందాలను మీద భారతప్రభుత్వం సంతకం చేస్తే, అది ప్రజల హక్కులను కాలరాసినట్లే అవుతుంది. చిన్న రైతులకు తీరని నష్టం చేస్తుంది, పర్యావరణానికి, జీవవవిధ్యానికి పెను ప్రమాదంగా మారుతుంది. ఈ విత్తనల మీద జరిగే ఒప్పందాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'మనం ఏం తినాలో కూడా ఆ కంపెని వాడే నిర్ణయిస్తాడు'. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మనం, ఏం తింటున్నేమో కూడా తెలుసుకునే హక్కును కోల్పోతాం, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా అదే.

మన దేశంలో ప్రభుత్వాలు మారతాయేమో కానీ విధానాలు మాత్రం మారవు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా, ఏ విధానాలను పార్టీలు వ్యతిరేకిస్తాయో, అధికారంలోకి రాగానే అవన్నీ మర్చిపోతాయి. అణుఒప్పందం కూడా అలాంటిదే. 2008 లో బీజేపీ అణుఒప్పందం బిల్లును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలుసు, కానీ ఇప్పుడే అదే బిజేపీ, అణుఒప్పందం కోసం అమెరికాకి ఎర్ర తీవాచీ పరుస్తోంది. అమెరికాకి ఒక రోగం ఉంది. వాళ్ళ దేశంలో చెడిపోయిన, మూతబడిన యంత్రాలను ఇతర దేశాల్లో ఎఫ్.డి.ఐ.ల పేరున అమ్మేసి డబ్బు చేసుకుంటుంది. ఇతర దేశాలను చెత్తకుప్పలుగా భావిస్తుంది. వాడేదో మనకు గొప్ప సహాయం చేస్తున్నట్టు మీడీయా చూపిస్తుంది. అదే తరహాలో మన దేశంలో అమెరికా అణురంగంలో పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించుకుంది. లాభాలు మాత్రం వారు తీసుకోవడానికి ఎగబడతారు కానీ ఒకవేళ ఆ అణురియాక్టర్‌లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే, దానికి నష్టపరిహారం మాత్రం చెల్లించరట, వారిని కోర్టులో బాధ్యులను చేయకూడదట. ఇది వాళ్ళ ఆర్ధిక విధానాలకు నష్టం కలిగిస్తుందట. అందుకని అణురంగంలో రెండు దేశాలు మరింత ముందుకు వెళ్ళాలంటే, ఈ రెండు విషయాల్లోనూ మనం వారు చెప్పిన మాట వినాలని అమెరికా అంటున్నది. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఇప్పుడు ఒబామా భారత్‌కు వస్తున్నారు. అంటే వారు మన దేశంలో వ్యాపారం చేసుకుని లాభాలు గడించవచ్చు, కానీ వాళ్ళ వల్ల జరిగిన ప్రమాదాలకు మాత్రం వాళ్ళు బాధ్యులు కాదట.

అనేక రంగాల్లో ఎఫ్.డీ.ఐ.ల పేరున అమెరికా భారత్ యొక్క ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకుందని తెలిసీ మన ప్రభుత్వాలు అభివృద్ధి అనే మాయమాట చెప్పి అమెరికాను వెనకేసుకొస్తున్నాయి. పార్టీలు మారినా, విధానాలు మారవని నిరూపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఒబామ పర్యటన వలన భారత్‌కు లాభం కలుగుతుందని చెప్పలేం కానీ నష్టం మాత్రం తప్పక కలుగుతుంది. దాన్ని ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి కప్పిపుచ్చుతున్నా, మీడియా ఇంకా అమెరికాను పొగడడం ఎంతో వింతగా ఉంది. దేశభక్తి గురించి, స్వదేశీ ఆర్ధికవిధానల గురించి తరచుగా మాట్లాడే పార్టీ కూడా అమెరికాతో ఒప్పందాలు చేసుకోవడం ఏమిటో?   

No comments:

Post a Comment