Thursday 22 January 2015

హిందూ ధర్మం - 133 (4 వేదాలు )

వేదాలు నాలుగు. అవి ఋగ్ వేదం, యజుర్ వేదం, సామ వేదం అధర్వణ వేదం. తొలుతుగా భగవంతుడు ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం 11:4, 2.3 చెప్తోంది. మనుస్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తూ, ఈ నలుగురు ఋషులే బ్రహ్మదేవుడికి నాలుగు వేదాలను బోధించారని, అలా నాలుగు వేదాలను ఒకేసారి నేర్చుకున్న మొదటివారు బ్రహ్మదేవుడని చెప్తోంది. (అయితే ఇక్కడ రెండు వాదాలు ఉన్నాయి. మొదటివాదం పైన చెప్పుకోగా, రెండవది ఇలా ఉంది. తొలుత వేదం నాలుగు భాగాలుగా కాక, ఒకట్టిగానే ఇవ్వబడిందని, ద్వాపారయుగాంతంలో వ్యాసమహర్షి దాన్ని నాలుగు వేదాలుగా విభాగం చేశారని చెప్తారు.) భగవంతుని ద్వారా ప్రకాశపరచబడిన వేదాలను ఈ ఋషులే మిగితా ఋషులందరికి చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న ఈ జీవ చక్రంలో, ఇప్పటికి సుమారు 197.5 కోట్ల సంవత్సరాల క్రితం వేదాన్ని స్వరయుక్తంగా ఋషులు దర్శించారు. వాటిని ధారణలో నిలుపుకున్నారు. ఎక్కడ గ్రందస్థం చేయలేదు, అనగా పుస్తకంలో రాయలేదు. గురువు నుంచి విని నేర్చుకోవడం తప్ప వేరొక మార్గం లేదు. దానికి ఎంత జ్ఞాపకశక్తి ఉండాలి! ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఒక్క అక్షరం మార్చబడలేదు. ఎలా అందుకున్నారో, అచ్చం అలానే వేదాన్ని తరతరాలుగా వల్లెవేస్తూ వచ్చారు.

ఎవరైనా కొత్త కాపురం మొదలుపెడుతుంటే, కొత్త ఇంట్లోకి వెళ్తూ, కొన్ని సామాన్లు, అవి కూడా అతి ముఖ్యమైనవి, ఏవి అత్యవసరమో అవి మాత్రమే తీసుకుని వెళతారు. తర్వాత మెల్లిగా కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు. ఇల్లు నిండిపోయి, తిరగడానికి చాలా  ఇరుకుగా అయిపోయేవరకు. అట్లానే భగవంతుడు కూడా సృష్ట్యాదిలో వేదాన్ని ఇచ్చినప్పుడు, అప్పుడు వారికి కావల్సిన జ్ఞానాన్ని అందించాడు. కానీ తర్వాత వేల మంది మహర్షులు వచ్చారు. కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు. వేదంలో మంత్రసంహితలో అన్నీ బీజ రూపంలో ఉన్నా, వాటిని అర్దం చేసుకుని, పరిశీలించి, పరిశోధించి, వేద విజ్ఞానాన్ని అనేకమంది మహర్షులు విస్తరించారు. శౌర శక్తితో నడిచే విమానాలు, వాయువు ఆధారంగా నడిచేవి, రాడార్లకు అందనంత గొప్ప పరిజ్ఞానం కలిగినవి, శబ్దవేగంతో పయనించే విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష నౌకలు మొదలైన అనేక విమానాలు కనుగొన్నారు. స్థూలంగా వైమానిక శాస్త్రమే వచ్చింది. అట్లానే ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష, జంతు, జీవ, భౌతిక శాస్త్రాలు, విద్యుత్ శక్తికి సంబంధిచినవి, అణ్వస్త్రాలకు చెందిన విజ్ఞానశాస్త్రం మొదలైన రకరకాలశాస్త్రాలు వివిధ ఋషుల పరిశోధన ఫలితంగా లోకం చూసింది. చిన్న విత్తనం నుంచి మఱ్ఱి చెట్టు పుట్టి, పెద్దగా ఊడలతో, కొమ్మలు, రెమ్మలు, ఆకులతో విస్తరించినట్టు వేదవిజ్ఞానం మంత్రసంహితను, బ్రాహ్మణాలను ఆధారంగా చేసుకుని, ద్వాపరయుగం నాటికి శాఖోపశాఖలుగా విస్తరించింది.

To be continued ....................

No comments:

Post a Comment