Thursday 29 May 2014

హిందూ ధర్మం - 70 (రాజర్షి విశ్వామిత్రుడు)

ఇది విన్న విశ్వామిత్రుడు సిగ్గుతో తలగించుకుని బాధపడ్డాడు. ఇంత మహత్తరమైన తపస్సు చేస్తే, నన్ను ఈ దేవతలు, ఋషిగణం రాజర్షిగానే గుర్తిస్తున్నారు. కనుక నేను చేసింది వృధా అని అన్నాడు. మళ్ళీ తపస్సుకు కూర్చున్నాడు. ఇదిలా ఉండగా, ఇక్ష్వాకు వంశస్థుడౌ, సత్యవాది, జితేంద్రియుడైన త్రిశంకుడనే రాజు ఉండేవాడు. గొప్ప యాగం చేసి సశరీరంతో (తనకున్న మానవఏహంతో) స్వర్గలోకానికి వెళ్ళాలనే కోరిక ఒకటి అతనికి కలిగింది. వెంటనే తమ కులగురువైన వశిష్టమహర్షి వద్దకు వెళ్ళి విషయం చెప్పగా, అది అసాధ్యం, దైవ సిద్ధాంతానికి విరుద్ధం అన్నారు మహర్షి. (మానవుడు తన శరీరంతో ఇతర లోకాలకు వెళ్ళలేడు. మరణించిన తర్వాత అతను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి, దేహంలో ఉన్న ఆత్మ, సూక్ష్మ, కారణ శరీరాలు స్వర్గనరకాలకు వెళతాయి/ఇతర జన్మలు పొందుతాయి. దేవలోకంలో ఉండే ధర్మాలు వేరుగా ఉంటాయి. కనుక అక్కడికి మానవశరీరంతో వెళ్ళడం అసాధ్యం). మహర్షి వద్దని చెప్పినా, త్రిశంకు వినలేదు, తన కోరిక తీర్చేవారు ఉండకపోరని దక్షిణదిశగా వెళ్ళాడు. ఆఖరికి 100 మంది వశిష్టమహర్షి పుత్రులు పరమతేజస్సుతో తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి చేరుకుని, వారి వారి వయసులను అనుసరించి ఒక్కక్కరికి అభివాదం చేసుకుంటూ వచ్చి, సిగ్గుతో తలదించుకుని తన గురుపుత్రులైన వశిష్ట కుమారులతో ఇ విధంగా అన్నాడు. 'నేను మీ దగ్గర శరణు పొందడానికి వచ్చాను. మీ శరణుజొచ్చినవారికి రక్షణ ఇస్తారని, చక్కని ఆశ్రయం కలిపిస్తారని విన్నాను, నన్ను మీ తండ్రి వశిష్ట మహర్షి తిరస్కరించారు. నేను ఒక విచిత్రమైన యాగం చేయాలని పూనుకున్నాను. మీరు వశిష్ట పుత్రులు కనుక దానికి మీరే సరైన మార్గం చూపించగలరని నా నమ్మకం. నేను మానవదేహంతో స్వర్గలోకానికి వెళ్ళె అర్హత పొందడానికి తగిన యాగం మీరే నా చేత నిర్వహింపజేయాలి. నా గుర్వైన వశిష్టమహర్షి తిరస్కరించారు కనుక వారి పుత్రులైన మీరు తప్ప నాకు వేరే దిక్కులేదు. ఇక్ష్వాకు వంశస్థులకు పురోహితులే పరమాగతి. కనుక వశిష్టుని వారసులైన మీరు నాకు వారిలాగే దైవ సమానులు.

ఇది విన్న వందమంది కోపంతో 'ఓ దుర్భుద్ది! సత్యవంతుడైన మీ గురువు నిన్ను ఈ విషయంలో తిరస్కరించారు. చెట్టే నిన్ను తిరస్కరించినప్పుడు, కొమ్మలను చేరి ఫలాలు ఆశిస్తావా? ఇక్ష్వాకు కులగురువు యొక్క మాటయే గొప్ప ఆదేశం, మహానుభావుడైన ఆ బ్రహ్మవేత్త మాటలను దిక్కరించడం అసాధ్యం. నువ్వు చెప్పిన వైదికక్రతువు అసాధ్యమైన్ మహాత్ముడైన వశిష్టుడే చెప్పాడు, ఇక ఆ క్రతువు చేయడానికి మాకెలా సాధ్యపడుతుంది. ఓ నరశ్రేష్టా! చిన్నపిల్లలవలె ప్రవర్తించకు. నీ రాజ్యానికి వెళ్ళు. మూడులోకాల్లో ఏ రాజు చేతనైనా ఎటువంటి యాగమైన చేయించగల సమర్ధుడు వశిష్టుడే. ఆయనకు కాదన్న పనిని మీ ఆచరించి, ఆయనకు అవమానం చేయలేము' అన్నారు.

To be continued ..............

No comments:

Post a Comment