Tuesday 6 May 2014

విద్యారణ్య భారతీ స్వామి - హిందూ సామ్రాజ్య స్థాపన

విద్యారణ్య భారతీ స్వామిని మరో ఆది శంకరాచార్యులుగా చెప్పచ్చు. మాధవ విద్యారణ్యగా పేరు పొందిన ఈయన గొప్ప దేశభక్తుడు, శ్రీ విద్యా ఉపసకులు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. క్రీ.శ.1268 లో వైశాఖ శుద్ధ సప్తమి నాడు జన్మించారు విద్యారణ్యులు.


దాదాపు 700 ఏళ్ళ పైగా భారతదేశం మీద మహమదీయుల దండయాత్రలు జరిగాయి. దక్షిణభారతంలో హిందువుల మీద అనేక దాడులు జరుగాయి, అనేకమంది చంపబడ్డారు, కొందరు మతం మార్చివేయబడ్డారు. విద్యారణ్య భారతీ స్వామి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతానికి వస్తున్న సమయంలో  గంగానది అధిష్ఠాన దేవత గంగాదేవి ప్రత్యక్షమై 'విద్యారణ్య, దక్షిణభారతంలో మ్లేఛ్చుల దండయాత్రల కారణంగా అనేకమంది హిందువులు చంపబడ్డారు. వారి రక్తం ఏరులైపారుతోంది, ఎన్నో వేల హిందువుల తలలు చెట్లకు వ్రేలాడుతున్నాయి. ఈ పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. నీవు తక్షణమే వెళ్ళి అక్కడ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించు, హిందూ ధర్మస్థాపన చెయ్యి' అంటూ గంగమ్మ కంటతడి పెట్టుకుని భోరున విలపించింది.

గంగాదేవి భాధను చూడలేకపోయిన విద్యారణ్యులు దక్షిణ భారతదేశానికి వచ్చారు. హరిహరరాయులు, బుక్కరాయులు హోయ్సల రాజ్యవంశపు సైనికాధికారులు. కాకతీయులు ఓడిపోయాక వీరిద్ధరు బలవంతంగా ఇస్లాంలో మారచబడ్డారు. విద్యారణ్యులు వీరిని తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకువచ్చి, రాజ్యస్థాపనకు తానే అధ్బుతమైన మూహుర్తాన్ని నిర్ణయించి, ఏ మూహుర్తంలో పునాది వేయడం వలన రాజ్యం 1000-1500 ఏళ్ళపాటు అజరామరంగా విరాజిల్లుతుందో పునాది రాయి వేయించే ప్రయత్నం చేశారు. కానీ దైవశాసనానికి, విధి నిర్ణయానికి ఎవరూ అతీతులు కారు. దాంతో మూహుర్తానికి ముందే కొన్ని కారణాలు చేత పునాది రాయి పడి, విజయనగర సామ్రాజ్యం వైభవోపేతంగా 400 ఏళ్ళు కొనసాగింది.

విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం భువనేశ్వరీ దేవిని ప్రార్ధించి, కనకవర్షం కురిపించి, అమ్మవారు ప్రసాదించిన ధనంతో దక్షిణభారతాన హిందూ సామ్రాజ్యం స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యపాలన చరిత్రలో స్వర్ణయుగం. దొంగ అనేవాడు విజయనగరంలో లేడు. పూర్తిగా ధర్మాచరణలో ప్రజలు జీవనం గడిపారు. వజ్రవైఢూర్యాలు రాశులుగా వీధుల్లో పోసి విజయనగరంలో అమ్మేవారని, అంత గొప్ప రాజ్యపరిపాలనను ప్రపంచంలో మరెక్కడా చూడలేదని ఎందరో విదేశీయులు తమ పుస్తకాల్లో రాసుకున్న విషయాలు ఇప్పటికి సజీవ సాక్ష్యాలు. అటు తర్వాత హంపిలో విరూపాక్షాలయాన్ని స్థాపించి, హంపి విరూపాక్ష పీఠాన్ని స్థాపించారు స్వామివారి. తాను సర్వశక్తిమంతుడై ఉండి, పైసా కూడా ఆశించక, సర్వశక్తులు ఒడ్డి సనాతన హిందూ ధర్మ రక్షణకు పాటుపడిన శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి వారిని మనస్పూర్తిగా ప్రార్దిద్దాం. ఈ రోజు విద్యారణ్య జయంతి, గంగాసప్తమి. ఇదే రోజున గంగాసప్తమి కనుక భారతదేశానికి, సనాతన ధర్మానికి ఆయువుపట్టు అయిన గంగమ్మను మనసార వేడుకుందాం.

ఈ దేశంలో హిందూ రాజ్యాలు దైవసంకల్పంతో ఏర్పడ్డాయని తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది కదూ.

No comments:

Post a Comment