Thursday 10 August 2023

శ్రీదత్త పురాణము (223)

 


సూర్యుడు చెప్పిన సప్తమీ స్నపనవ్రతం


ధర్మరాజా ! వరాహకల్పంలో వైవస్వతమన్వంతరంలో కృతయుగంలో ప్రధమ పాదాన హైహయవంశం ఉండేది. ఆ వంశంలో కృతవీర్యుడు అనే మహారాజు మహాప్రతాపశాలియై సప్త ద్వీపాకృతమైన మహీమండలాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. డెబ్భైయేడు వేల సంవత్సరాలు పాలించాడు. ఆ మహారాజుకి వందమంది పుత్రులు జన్మించి, చ్యవన మహర్షి శాపాగ్నికి ఆహుతి అయ్యారు. పుత్ర శోకం తట్టుకోలేక రాజదంపతులు వోలు వోలున విలపిస్తూ బృహస్పతిని శరణువేడారు. ఎందుకు ఇలా జరిగింది ? మాకు ఈ జన్మలో పుత్రోత్సాహం ఉన్నదా ? వంశోద్ధారకుడు కలుగుతాడా ? - మేమేమి చెయ్యాలి ? దివ్యదృష్టితో పరిశీలించి అనుగ్రహించండి అని కాళ్ళా వేళ్ళా పడి అభ్యర్ధించారు. బృహస్పతి మహాపండితుడే అయినా హృదయంకలవాడు కనుక స్పందించాడు. దివ్యదృష్టి సారించాడు. కృతవీర్యా ! దుఃఖించకు క్లేశాలుపడతావుగానీ త్వరలోనే నీకు దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. అయితే ఈలోగా నువ్వు వదిలించుకోవలసిన కల్మషాలు కొన్ని ఉన్నాయి. వాటి ఫలితంగానే మీకిద్దరకూ ఈ పుత్ర శోకం, వాటిని వదిలించుకో. దీనికి ఒక మార్గం వుంది. దత్తాత్రేయుడు తన భక్తులకి ప్రబోధించిన సప్తమీ స్నపనవ్రతాన్ని మీరు ఆచరించండి. కల్మషాలు తొలగిపోతాయి. మీకోరికలు తీరతాయి. ఈ వ్రతవిధానం తెలిసినవాడు కర్మసాక్షి సూర్య భగవానుడు కనుక ముందుగా అతణ్ని అర్చించి ప్రసన్నుణ్ని చేసుకోండి. ఇక క్షణం కూడా వృధాచేయకండి. వెళ్ళిరండి శుభమగు గాక - అని ఆశీర్వదించి పంపించాడు.


కృతవీర్యుడు ఉపవాసదీక్షతో వేదమంత్రాలతో నెలవాళ్ళూ సూర్యుణ్ని అత్యద్భుతంగా ఆరాధించాడు. దానికి సంతుష్టుడై సహస్రకిరణుడు ప్రత్యక్షమయ్యాడు. సప్తమీస్నపనవ్రతాన్ని ఉపదేశించాడు. రాజా! ఈ వ్రతాన్ని ఆచరిస్తే శిశుమరణాలు అంతరిస్తాయి. వ్యాధిపీడలు తొలగుతాయి. అన్ని వయస్సులవారికీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నీ చింతలను తొలగిస్తుంది. వ్రత విధానం చెబుతున్నాను శ్రద్ధగా గ్రహించు.


No comments:

Post a Comment