Monday 14 August 2023

శ్రీదత్త పురాణము (227)

 


అనంతుడికి నమస్కారమని శిరస్సునూ, సర్వాత్ముడికి ననుస్కారమని పాదాలను, శేషుడికి నమస్కారమని జామాయుగళాన్ని, కాముడికి నమస్కారమని కటిని, వాసుదేవుడికి నమస్కారమని పార్శ్వాలనూ, సంకర్షుణుడుకి నమస్కారమని ఊరు యుగళాన్ని, వస్త్రధారికి నమస్కారమని భుజాలను, శ్రీకంఠనాధుడికి నమస్కారమని కంఠాన్ని, విశ్వముఖుడుకి నమస్కారమని ముఖాన్ని ఇలాగే నా నామధేయాలతో (శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతున్న కథ) హల ముసలాలనూ అర్చించాలి. తరువాత నక్షత్ర దేవతా పూజలు చెయ్యాలి. చంద్రుణ్ని పూజించాలి. ఆకాశ జలంతో నింపి బంగారం వేసి పన్నెండు ఘటాలు నింపి మాస - సంత్సరాది దేవతలను ఆవాహన చేసి యధావిధిగా అర్చించాలి. కడపటి వేద పురాణవేత్తయై జితేంద్రియుడై శాంత స్వభావుడైన పురోహితుడికి లేదా మరొక యోగ్యనిపుడికి ఈ సువర్ణానంత ప్రతిమనూ రజత హల ముసలాలనూ అనంతుడు సుప్రీతుండగుగాక అంటూ దానం చేసి దక్షిణ తాంబూలాలు నూతన వస్త్రాలు అందించాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా యధాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి విందు భోజనాలతో సంతృప్తిపరచాలి. ధర్మజా! అప్పటికి ఈ వ్రతం సమాప్తమవుతుంది- అని మైత్రేయి శీలధరకు అనంత వ్రత విధానం ఉపదేశించింది. ఇది నిష్టగా చేస్తే సకల మనోరధాలూ నెరవేరతాయి. పుత్రార్థులకు సత్సంతానం కలుగుతుంది. కళ్యాణార్ధులకు కళ్యాణం జయార్థులకు జయం ఆరోగ్యార్థులకు ఆరోగ్యం ధనార్ధులకు ధనం సంపదార్ధులకు సంపదలూ- ఒకటేమిటి ఏదికోరుకుంటే అది లభిస్తుంది. ఈ అనంత వ్రతం పాపనాశకం, పుణ్యప్రదం, సుఖదాయకం. కనుక ఓ శీలధరా! దీన్ని ఆచరించు.


సర్వలోక వరిష్ఠుడైన పుత్రుడు నీకు కలుగుతాడు అని మైత్రేయి నిండు మనస్సుతో ఆశీర్వదించింది. శీల ధర రాజధానికి వెళ్ళి వెంటనే ఈ వ్రతం ఆచరించి సంవత్సరకాలం నిష్టగా జరిపింది. అనంతుడు సంతుష్టుడయ్యాడు. దిగంబర దత్తాత్రేయరూపంతో స్వప్నంలో సాక్షాత్కరించి నీకు సత్పుత్రుడు కలుగుతాడు. విఖ్యాతి పొందుతాడు. మహావీరుడై సప్తద్వీపావృత వసుంధరనంతటినీ పరిపాలిస్తాడు. యోగవిద్యాపారంగతుడు అవుతాడు అని వరమిచ్చి అంతర్ధానం చెందాడు.


శీలధరకు మెలకువ వచ్చింది. అన్నివైపులా చూసింది ఎవ్వరూ కనిపించలేదు. స్వప్నమని గ్రహించింది. ఆనందించింది. భర్తను నిద్రలేపింది. తన స్వప్నం వివరించింది. అతడూ సంబరపడ్డాడు. నీకల నిజమవుతుందని శుభాకాంక్షలు పలికాడు. అటుపైన కొంతకాలానికి ఒక సుముహూర్తాన శీలధరకు మగబిడ్డ జన్మించాడు. అప్పుడు శుభసూచకంగా చల్లని వాయువులు వీచాయి. ఆకాశం విశదమయ్యింది. జగత్తు అంతా మురిసిపోయింది. దేవదుందుభులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. దేవగంధర్వగీతాలు వినిపించాయి. అప్సరసల నాట్యాలు కనిపించాయి. లోకులందరికి ధర్మం పట్ల ఆసక్తి కలిగింది. కృతవీర్యుడి కుమారుడు కాబట్టి కార్తవీర్యార్జునుడయ్యాడు. ఈ బాలుడు తపస్సు చేసి సేవలు చేసి దత్తాత్రేయుణ్ని మెప్పించి అనుగ్రహపాత్రుడయ్యాడు. ఆ స్వామి సహస్ర బాహువులూ అనంతశక్తి యుక్తులూ సహప్రాయుధాలు శౌర్యపరాక్రమాలు, సమస్తమూ ఇచ్చి అతణ్ని చక్రవర్తిని చేశాడు. అంతేకాదు కార్తవీర్యనామస్మరణ చేస్తే చాలు సకల భయాలూ తొలగిపోయేటట్లు, నమోస్తు కార్తవీర్యాయ అంటూ తిలపాత్రదానం చేసిన వారికి సకల పుణ్యాలూ కలిగేట్లూ, పోయిన వస్తువులు దొరికేటట్లూ దత్తదిగంబరుడు వరాలు ఇచ్చాడు. ఇలా మహిమాన్వితుడై ఆయుత సంవత్సరాలు భూగోళాన్ని ఏకచ్ఛత్రంగా పరిపాలించాడు. అంచేత ధర్మరాజా! ఈ అనంతవ్రతం మహత్మ్యం అంతటిది- అని శ్రీకృష్ణుడు అలనాడు ధర్మరాజుకి ఉపదేశించాడు. అది అంతా, దీపకా!: నీకు నేను చెప్పాను. కార్తవీర్యుడి తల్లితండ్రుల కధ పుత్రుడి కోసం వారి పాట్లు విన్నావు గదా! ఇంకా ఏమి కావాలి అన్నాడు వేదధర్ముడు.


No comments:

Post a Comment