Wednesday 23 August 2023

శ్రీదత్త పురాణము (236)

 


దీనికి కసలి భార్గవరాముడు దుష్టులైన క్షత్రియులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భూమండలమంతా ఇరవై యొక్కసార్లు గాలించి దుష్టక్షత్రియ సంహారం చేశాడు. వారి రక్తంతో శమంతపంచకంలో తొమ్మిది మడుగులు నింపి పితృ తర్పణాలు విడిచిపెట్టాడు. ఆ తరువాత పదిబారల పొడుగూ తొమ్మిది బారల వెడల్పుతో బంగారు వేదికను నిర్మించి భూరిదక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు వేదికను నిర్మించి భూరిదక్షిణలతో మహాయజ్ఞం చేశాడు. యజ్ఞాంతంలో ఆ కాంచనమయ వేదికను ప్రధాన ఋత్విక్కు కశ్యపుడికి దానం చేశాడు. దాన్ని ఆ మహర్షి అనుజ్ఞతో సమభాగాలుగా ఖండించి యాజ్ఞకులందరూ పంచుకున్నారు. అప్పటి నుంచీ ఆ బ్రాహ్మణులకు ఖండవాయనులని పేరు ఏర్పడింది.


క్షత్రియ సంహారం చేసి స్వాయత్తం చేసుకున్న భూగోళాన్ని కూడా బ్రాహ్మణులకు పంచిపెట్టాడు. సరస్వతీ నదీలో అవభృధస్నానం చేశాడు. కల్మషాలన్నీ తొలగించుకున్నాడు. ఈ మహేంద్రపర్వతం మీద నివాసం ఏర్పరుచుకుని ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటున్నాడు అని అకృత బ్రాహ్మణుడు భార్గవరామ కథను ముగించాడు. అప్పటికి తెల్లవారింది. చతుర్దశి వచ్చింది. భార్గవరాముడు వచ్చాడు. ధర్మజాదులు ఆ మహర్షిని దర్శించి భక్తి ప్రపత్తులతో పాదపూజలు చేశారు. భార్గవుడు కూడా వారినందరినీ ఆదరించి ఆ రోజుకి తన ఆశ్రమంలోనే ఆతిథ్యమిచ్చి మర్నాడు. వీడ్కోలు పలికాడు. తానూ దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాడు.


దీపకా ! విన్నావు కదా ! శ్రీమన్నారాయణుడు దత్తరూపంలో వరాలిచ్చి కార్తవీర్యార్జునుణ్ని మహావీరుణ్ని చేసి అతడు కోరుకున్నట్టే అధికవీరుడై విప్రుడై భార్గవరాముడై వచ్చి అతణ్ని సంగ్రామంలోనే సంహరించాడు. నాయనా ! ఇదీ విష్ణోశ్చరితమధ్భుతమ్ ! సంక్షేపంగా చెప్పాను - అని వేదధర్ముడు ముగించాడు.


గురుదేవా ! దత్తాత్రేయుడు సాధ్యజాతిదేవతలు వచ్చి అడిగితే ఇహపరాలకు ఉపకరించే శమదమాదుల్నీ, నీతుల్నీ ఉపదేశించాడని విన్నాను. వాటిని తమరు నాకు కూడా ఉపదేశించవలసిందిగా కోరుతున్నాను.


దీపకా ! జ్ఞానకళా స్వరూపుడూ - స్వయంభువూ అయిన పరమేశ్వరుడే అత్రిపుత్రుడుగా అవతరించాడు. అతడు జ్ఞాన ఘనుడు. సాక్షాజ్జగద్గురుడతడు. దేవతలకూ, సిద్ధులకూ, సాధ్యులకూ, మనుష్యులకు అందరికీ అతడే పరమ గురువు. జ్ఞాన - యోగ - తపో - యమ - నియమ - శమాది మార్గాలలో ఎవరు ఏ మార్గంలో సాధన చేసినా సేవించిన దత్తాత్రేయ సద్గురుని అనుగ్రహం పొందుతారు. ఆయనే అందరికీ మార్గమూ గమ్యమూను, సంసార సాగరాన్ని తరించి కృతార్ద్రత పొందాలంటే ఈ సద్గురూ పాసన ఒక్కటే సాధనం. అంచేత సాధ్యజాతి దేవతలు సైతం దత్తాత్రేయుణ్ని ఆశ్రయించి భక్తిజ్ఞాన యోగాది రహస్యాలనే కాక తమకు కావలసిన లౌకికాలౌకిక విషయాలన్నింటినీ అడిగి తెలుసుకొని వెడుతుంటారు. అలా ఒక సందర్భంలో దత్తాత్రేయుడు సాధ్యులకు చేసిన నీతి ప్రభోదాలను ఒకానొక సందర్భంలో విదురుడు దృతరాష్ట్రుడికి వినిపించాడు. వాటిని ఆ ఇద్దరి సంభాషణగా నీ ముందు ఉంచుతాను గ్రహించుకో అని వేధర్ముడు ఇలా ప్రవచించాడు.


No comments:

Post a Comment