Wednesday 16 August 2023

శ్రీదత్త పురాణము (229)

 


అతడి ఏలుబడిలో ప్రజలు అపూర్వసుఖాలు అనుభవించారు. ఏ కష్టం వచ్చి ఏ పౌరుడు తనను తలుచుకున్నా కార్తవీర్యార్జునుడు స్వయంగా ప్రత్యక్షమయ్యేవాడు. ఆదుకునేవాడు. ఒక్కసారిగా ఏడుదీవుల్లోనూ ఎక్కడైనా ఎవరికైనా స్మరిస్తే చాలు ప్రత్యక్షమయ్యేవాడు.


తానే పశువుల్ని కాసేవాడు. పర్జన్యుడై వర్షించేవాడు. ఇటువంటి అద్భుతశక్తులు అనేకం అతడికి అందించాడు. దత్తస్వామి, యోగమార్గంలో కూడా నిష్ణాతుణ్ని చేసాడు. కర్కోటకుణ్ణ్ని తెచ్చి ఈ కార్తవీర్యుడు తన రాజధాని మహిష్మతికి కావలి పెట్టాడు. ఒకనాడు ముచ్చటపడి అంతఃపురకాంతలతో జలకాలాడుతూ తన వెయ్యి బాహువులనూ సాచి నర్మదా నదీ ప్రవాహానికి అడ్డుకట్టవేశాడు. ప్రవాహాన్ని వెనుక దారి పట్టించాడు. సముద్రాన్ని ఒకసారి ఇలాగే అల్లకల్లోలం చేసాడు. ముల్లోకాలను గడగడలాడించిన దశకంఠుడ్ని అవలీలగా బంధించి కారాగారంలో పడేశాడు. ఆ తరువాత పులస్త్యబ్రహ్మ స్వయంగా వచ్చి కార్తవీర్యుణ్ని బ్రతిమాలి రావణున్ని విడిపించుకెళ్ళాడు.


ఒక పర్యాయం ఆకలిగొన్న విప్రునిరూపంలో చిత్రభానుడు అర్ధిస్తే అతడికి యావద్భూగోళాన్ని బిక్షగా సమర్పించాడు ఈ కార్తవీర్యుడు. (మొత్తం భూగోళాన్ని అగ్నిబాణరూపంలో భక్షిస్తూంటే తాను చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు వశిష్ట మహర్షి తన వేల సంవత్సరాల తపోదీక్ష నుండి జలసమాధి నుండి ఇవతలకి వచ్చి పరిస్థితి గమనించి కార్తవీర్యార్జునుణ్ని శపించాడు. బ్రాహ్మణ బాలుడైన భార్గవరాముని చేతిలో సంహరింపబడతావన్నాడు. దత్తాత్రేయుడి నుండి తానువరంగా పొందిన మరణ విధానమూ ఈ శాపమూ సంపాదించటంతో కార్తవీర్యుడు సంబరపడ్డాడే కానీ దిగులు చెందలేదు.)


ఇంతటి మహామహిమాన్వితమైన మహాయోగి కార్తవీర్యార్జునుడు దత్తయోగీశ్వరుని దయవల్ల మర్త్య లోకంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ మహావ్రతం - ఈ అనఘాష్టమీ వ్రతం.


అఘము అంటే పాపం, అది మనోవాక్కాయకర్మలుగా మూడు విధాలు. దాన్ని నాశనం చేస్తుంది కనుక ఇది అనఘవ్రతం. అనఘుడు అంటే దత్తాత్రేయుడు. అనఘా అంటే లక్ష్మీదేవి. అనఘుడు ఉపదేసించింది కాబట్టి అది అనఘవ్రతం. అనఘాదేవిని ఆరాధించేది కాబట్టి అనఘావ్రతం ఇలా దీనికి మూడు విధాలుగా సార్థక్యం వచ్చింది.


No comments:

Post a Comment