Sunday 27 August 2023

శ్రీదత్త పురాణము (240)

 



దీపకా! నువ్వు ధన్యుడవు కావటమే కాదు నీ తల్లిదండ్రుల్ని సైతం ధన్యుల్ని చేస్తున్నావు. పితృదేవతల్ని తరింపచేస్తున్నావు. నువ్వు సంపాదించుకుంటున్న ఈ పుణ్యకథా శ్రవణఫలం అంతటిది. అంతేకాదు అడిగి నాతో వీటిని చెప్పించి నన్ను కూడా ధన్యుణ్ని చేస్తున్నావు. నాయనా ! నీలో ఇంకొక సుగుణం నాకు మరీ నచ్చింది. ప్రతికథనూ నేను చెబుతున్నంత శ్రద్ధగానూ వింటున్నావు. ఏదైనా ఒకటి మునుపు విన్నదే మళ్ళీ ప్రస్తావనకు వచ్చినా నన్ను ఆనందపరచడంకోసం ఇదే మొదటిసారి అన్నంత శ్రద్ధగా వింటున్నావు. ఇలాంటి శ్రోత దొరకడం చాలా అదృష్టం పైగా కథ కూడా అటువంటిది.


వేన వృత్తాంతము


అనగా అనగా ఒక పక్షిరాజు, అతడి పేరు కుంజులుడు. అతడికి నలుగురు కొడుకులు. శౌర్యవీర్య బలోన్మత్తులు. గరుత్మంతుడితో సమానులు. వీరిలో పెద్దవారి పేరు కపింజలుడు. ఈ నలుగురూ ప్రతిరోజు నాలుగు దిక్కులకి వెడతారు. సంచరిస్తారు. సాయంకాలానికి తిరిగి వస్తారు. తాము కన్నవీ విన్నవీ వింతలూ విడ్డూరాలు ముసలి తండ్రికి వినిపిస్తుంటారు. భోజనాల సమయంలో తండ్రితో వీరికి ఇదొక మంచి కాలక్షేపం. ఆ తండ్రి కూడా ఆడిగి అడిగి విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు.


ఒకనాటి సాయంకాలం కపింజలుడు పట్టరాని ఆనందంతో తిరిగివచ్చి తండ్రికి సవినయంగా నమస్కరించి - తండ్రీ ! ఈ రోజు నేనొక వింత చూసాను. ఒక మహానుభావుడు అగ్నిలా ప్రజ్వరిల్లుతూ తపస్సు చేస్తుంటే ప్రసన్నుడై జనార్ధనుడు దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీమన్మహావిష్ణువును నేను దర్శించగలిగాను. తండ్రీ! నిజంగా నా జన్మ సఫలమయ్యింది. నా కన్నులు చరితార్థమయ్యాయి అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు..


నాయనా ! కపింజలా ! నిజంగా నువ్వు భాగ్యశాలివి. ఇంతకీ ఆ తపస్వి ఎవరు ? అతడి ప్రభావం ఏమిటి ? జనార్ధనుణ్ని ఎలా ప్రసన్నుణ్ని చేసుకున్నాడు? ప్రసన్నుడై వచ్చిన వరదుడు అతడికి వఱద కట్టించిన వరాలేమిటి? ఈ విశేషాలన్నీ నువ్వు చెప్పాలి. నువ్వు అదృష్టవంతుడని మాత్రమే కాదు సర్వజ్ఞుడవు, యోగ విద్యావేత్తవు. కాబట్టి నీకు తెలియనిదంటూ ఉండదు. నేనెరుగుదును అంచేత ఇవన్నీ చెప్పి నా కుతూహలం తీర్చు.


తండ్రీ ! నాకు తెలిసినంతమట్టుకు తప్పకుండా చెబుతాను. అందరూ వినండి తుంగుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు. గురుచరణసేవా పరాయణుడు. మహాతపస్వి. అతడికి ఏదో ఒక దుర్యోగం వల్ల అత్యుల్బణుడు వేనుడనే కొడుకు పుట్టాడు. పాపకర్మ ఫలితంగా వేనుడు నిత్యమూ రోగపీడితుడై దుఃఖ పడుతున్నాడు. తండ్రి చూసి- తపస్సు చేసుకో, పాప క్షయమూ, రోగక్షయమూ అవుతుందని ఆజ్ఞాపించాడు. అందుమీదట వేనుడు ఆరోగ్యకాంక్షతో ఘోరతపస్సు చేశాడు. గోవిందుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యాన్నీ రాజ్యభోగాలనూ సత్సంతానాన్ని వరాలుగా ప్రసాదించాడు. వేనుడు రాజ్యభోగాలు చాలాకాలం అనుభవించి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి మళ్ళీ అరణ్యాలకు వచ్చి తపస్సుకు కూర్చున్నాడు. తీవ్రంగా తపస్సు సాగించాడు. గోవిందుడు గరుడవాహనం మీద మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.

No comments:

Post a Comment