Tuesday 22 August 2023

శ్రీదత్త పురాణము (235)

 


ఒకనాడు రేణుకాదేవి స్నానానికి వెళ్ళింది. ఆ సరోవరంలో మూర్తికావతక పట్టణాధిపతి చిత్రరథుడు తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. రేణుకాదేవి కొంచెంసేపు నిలబడి వాళ్ళని చూసింది. తానూ అలాంటి జలకేళికి ముచ్చటపడింది. వెంటనే మనస్సును నిగ్రహించుకుంది. స్నానం ముగించుకొని త్వరత్వరగా ఆశ్రమం చేరుకుంది. ఆలస్యానికి జమదగ్ని మండిపడతాడని భయపడుతూనే ఉంది. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రేణుకను మహర్షి తేరిపారచూశాడు. ముఖంలో బ్రాహ్మ్యకళ లోపించడాన్ని గుర్తించాడు. ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. 


సమత్కుశలకోసం అడవికి వెళ్ళిన నలుగురు కొడుకులూ అదే సమయానికి తిరిగివచ్చారు. వాళ్ళని చూసి, మీ తల్లిని సంహరించండి అని ఒక్కొక్కరికీ పేరుపేరునా ఆజ్ఞాపించాడు జమదగ్ని. అయితే ఆ కుమారులు కన్నతల్లిని సంహరించడానికి మనసొప్పక స్థాణువులై నిలబడిపోయారు. దీనితో జమదగ్నికి క్రోధం రెట్టింపు అయ్యింది. నా మాట వినలేదు కాబట్టి మీరు నలుగురూ ఈ అరణ్యంలో మృగాల్లాగా పక్షుల్లాగా జడజీవితం గడపండి అని శపించాడు. అంతలోకీ పరశురాముడు వచ్చాడు. జమదగ్ని అతడికి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు. పాపశీల నీ తల్లిని సంహరించమన్నాడు. అనడమేమిటి అతడు తన గండ్రగొడ్డలితో తల్లి శిరస్సు నరికివేశాడు. జమదగ్ని కోపం చల్లారింది. సంతోషించాడు. భార్గవరామా! వరాలు కోరుకో ఇస్తానన్నాడు.


తల్లి పవిత్రురాలై పునరుజ్జీవించాలనీ ఈ శిరఃఖండన వృత్తాంతం ఆమెకు గుర్తుండకూడదనీ సోదరులు నలుగురూ శాపవిముక్తులు కావాలనీ తనకు మాతృహనవదోషం అంటకూడదనీ రణరంగంలో ఆప్రతిహతశక్తి దీర్ఘాయువూ తనకు కావాలనీ రాముడు కోరుకున్నాడు. జమదగ్ని తథాస్తు అన్నాడు. రేణుకాదేవి నిద్రనుంచి మేల్కొనట్టు కళ్ళు తెరచి చూసింది. అన్నగార్ల జడత్వం వదిలిపోయింది. తానూ విముక్తుడు అయ్యాడు.


అటుపైన కొంతకాలానికి కార్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి హోమధేనువును బలాత్కారంగా లాక్కుపోయాడు. దీనికి అలిగిన భార్గవ రాముడు కార్తవీర్యుడి సహస్ర బాహులను ఖండించి సంహరించాడు. హోమధేనువుని తోలుకుని తెచ్చుకున్నాడు. దీనికి ప్రతీకారంగా కార్తవీర్యుడి కొడుకులు ఆశ్రమానికి వచ్చి ఒంటరిగా ఉన్న జమదగ్నిని సంహరించి పారిపోయారు.


No comments:

Post a Comment