Friday 25 August 2023

శ్రీదత్త పురాణము (238)

 


ఈటెలలాంటి మాటలతో ఎదుటివారి హృదయాలను తూట్లుపొడిచే మానవుణ్ని లక్ష్మి సరస్వతులు ఆ క్షణంలోనే పరిత్యజిస్తాయి. దరిద్రదేవత వాడి ముఖంలో స్థిర నివాసమేర్పరుచుకుంటుంది. నిప్పులు కక్కుతున్న వాగ్భాణాలతో ఎవరు ఎంతగా హింసించినా చలించని వాడూ గుండెలు దహించుకుపోనివాడూ నిజమైన యోగి. అతడు తన సుకృతాన్ని ఇంతకింతగా పెంచుకుంటున్నాడని గ్రహించు. అంబికేయా ! వస్త్రాలకు రంగులు అంటుకున్నట్టే మనుషులకు గుణాలూ అంటుకుంటాయి. సజ్జనుణ్ని సేవిస్తే సజ్జనత్వం, దుర్జనుణ్ని సేవిస్తే దుర్జనత్వం, తపస్విని సేవిస్తే తపస్విత్వం, చోరున్ని సేవిస్తే చోరత్వం క్రమంగా సంక్రమిస్తాయి. ఆరు నెలల సావాసంతో వీరు వారవుతారని లోకోక్తి.


తనను నిందించిన వాణ్ని తాను నిందించకుండా మరొకరితో నిందింపజెయ్యకుండా, తనను కొట్టినవాణ్ని తాను కొట్టకుండా కొట్టించకుండా, తనకు ద్రోహం చేసిన వాడికి తాను ద్రోహం చెయ్యకుండా చేయించకుండా జీవించేవాడికి ఏ పాపమూ అంటదు. దేవతలు మెచ్చి స్వయంగా ఎదురువచ్చి అతణ్ని తమ లోకానికి తీసుకువెడతారు.


రాజా ! అవ్యాహృతం వ్యాహృతాత్ శ్రేయ ఆహు మాట్లాడటంకన్నా మౌనం ఎప్పటికీ శ్రేయోదాయకమన్నారు.


ఒకవేళ మాట్లాడవలసినస్తే సత్యమే పలకాలి. అది రెండురెట్లు మంచిది. అది ప్రియం కూడా అయ్యేట్టు మాట్లాగడలిగితే మూడురెట్లు మంచిది. సత్యమూ ప్రియమే కాక ధర్మబద్ధంకూడా అయ్యేట్టు పలకగలిగితే అది నాలుగురెట్లు మంచిది. మనిషి ఎవరిని జతచేర్చుకుంటాడో, ఎవరితో జతకడతాడో, తానెటువంటివాడు కాదలుచుకున్నాడో దాన్నిబట్టి మార్పులు వస్తాయి. అటువంటివాడు అవుతాడు. ఏయే విషయాలను నివర్తించగలుగుతాడో తాను ఆయా విషయాల నుంచి విముక్తుడవుతాడు. ఇలా క్రమంగా అన్నింటినీ నివర్తించుకోగలిగిన వాడికి అణుమాత్రమైన దుఃఖం ఉండదని తెలుసుకో. ఇదొక నిరంతరసాధన. దుఃఖాన్ని జయించే ఏకైక మార్గం. నిందా, ప్రశంసలు రెండింటినీ సమానంగా చూడగలిగినవాడు ఒకరిని జయించడు. ఒకరికి తాను ఓడిపోడు. ఒకణ్ని శత్రువనుకోడు, ఒకడికి తాను శత్రువుకాడు. ఇటువంటివాడికి సుఖదుఃఖాలు అంటవు. అందరికీ మంచి జరగాలనీ ఎవ్వరికీ కీడు జరగకూడదనీ కోరుకునేవాడూ, మృదు స్వభావం కలవాడూ, అంతర్భహిరింద్రియాలను నిగ్రహించినవాడూ - అతడూ ఉత్తమ పురుషుడంటే.


No comments:

Post a Comment