Saturday 26 August 2023

శ్రీదత్త పురాణము (239)

 


యాచకుల్ని ఆదరించేవాడూ, ఇస్తానన్నది వెంటనే ఇచ్చేవాడూ, ఇతరుల్లో రంధ్రాన్వేషణ చేయనివాడూ ఉత్తముడు. ఇక దుష్టుడెలా ఉంటాడంటే- ఎవ్వరు ఏమంచి పని చెప్పినా వినడు. పరుల్ని శంకించడం తనని తాను శంకించుకోవడం, నిత్య శంకితుడుగా ఉంటాడు. మిత్రుల్ని ఉత్తపుణ్యానికి దూరం చేసుకుంటాడు. అంతరాత్మను చంపుకుంటాడు. కోపవివశుడుగా ఉంటాడు. ఇతరులు చేసిన మేలుని ఆ నిమిషంలోనే మరచిపోతాడు- ఇవీ దుష్టుడి లక్షణాలు, వీణ్ని అధమపురుషుడంటారు.


శ్రేయస్కాముడు ఎప్పుడూ తనకంటే ఉత్తములనే సేవించాలి. కాలానుగుణంగా అవసరమైతే మధ్యముల్ని కూడా సేవించవచ్చు. అంతేకాని అధముల్ని చేస్తే సేవించకూడదు.


లోకంలో ఒక్కొక్కసారి అధములుకూడా బాగా ధనం ఆర్జిస్తారు. తెలివితేటలనండి, బలమనండి, పౌరుషమునండి - ఏదో ఒకటి ఉపయోగించి బాగా కూడబెడతారు. అంత మాత్రాన సంఘంలో అతడు ప్రశంసా పాత్రుడుకాడు. పెద్దల సరసన కూర్చోలేడు.


దత్తాత్రేయుడు అందించిన ఈ నీతి నాగామృతాన్ని ఆస్వాదించి సాధ్యులు స్వామి దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ నీతుల్ని నీ పెద్దకొడుక్కి బోధించి దారిలో పెట్టుకో అని విదురుడు ధృత రాష్ట్రుణ్ని హెచ్చరించాడు.


దీపకా నిన్నావు గదా. ఇవి ఇహపరసారకాలైన నీతివాక్యాలు. ఇంకా చాలామంది ఇలాగ దత్తుణ్ని ఆశ్రయించి సంశయాలు తొలగించుకొని సన్మార్గాలు అలవరచుకొని జీవన్ముక్తులైనవారు ఉన్నారు. పరమాత్మగా ధ్యానించి అపునర్భవమైన ముక్తిని పొందుతున్నవారూ ఉన్నారు. మరింకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు చెబుతాను అన్నాడు వేదధర్ముడు.


గురూత్తమా ! అత్రిపుత్రుడి మహాత్మ్యాలు ఇంకా వినాలి అన్నదొక్కటే నా కోరిక. ఎంతకీ తనివి తీరడంలేదు. భరత వంశంలో ఆయువుకి దత్తానుగ్రహం వల్లనే నహుషుడు జన్మించాడనీ ఆ యోగీంద్రుణ్ని ఆరాధించి శత్రువుల్ని జయించి చక్రవర్తి అయ్యాడనీ క్లుప్తంగా విన్నాను. ఇది కాస్త వివరంగా ఈ శిష్యుడికి వినిపించి హృదయాబ్దాన్ని వికసింపజేయండి.


No comments:

Post a Comment