Tuesday 15 August 2023

శ్రీదత్త పురాణము (228)

 


అనఘా వ్రతమహిమ


గురుదేవా! దత్తదేవుణ్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఏమిచెప్పాలో నువ్వే నిశ్చయించి ఎరుకపరుచు, ధర్మరాజు శ్రీకృష్ణుణ్ని ఇంక ఏమీ అడగలేదా? అడిగితే శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు? ఆ రహస్యాలు తెలుసుకోవాలని, ఉంది. కటాక్షించండి.


దీపకుడి అభ్యర్ధన వేదధర్ముడికి వచ్చింది. తాను చెబుదామనుకుంటున్నదే శిష్యుడు అడిగాడు. సంబరపడి ఇలా ఆరంభించాడు. నాయనా దీపకా! శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పిన అవఘావ్రత మహిమను ఆలకించు.


ధర్మరాజా! అనసూయాత్రి దంపతులకు విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. అతడి ప్రియురాలి పేరు అనఘాదేవి. లక్ష్మీదేవియే అనఘాదేవి. వీరికి ఎనిమిది మంది సంతానం. అష్టసిద్ధులే కుమారులుగా అవతరించాయి.


ఒకప్పుడు జంభాసురుడి ధాటికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలందరూ అమరావతిని వదలి బ్రతుకు జీవుడా అని సలాయనం చిత్తగించారు. సహ్యాద్రి మీద తపస్సు చేసుకుంటున్న దత్తాత్రేయుణ్ని శరణు వేడారు. వారిని తరుముకుంటూ రాక్షసులూ వచ్చారు. దత్తాత్రేయుడు అనఘాదేవి సహితుడై యుక్తిగా ఆ రాక్షసులందర్ని సంహరింపజేసి దేవతలను కాపాడాడు. ఇంద్రుడికి సింహాసనం అప్పగించాడు. 


ఈ దత్తయోగీంద్రుడు యోగమార్గం అవలంబించి వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. కళ్ళు తెరచి భ్రూమధ్యస్థానంలో దృష్టి నిలిపి మూడు వేల దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తరమనే దివ్యతపస్సు చేసాడు. కాష్టంలాగా పర్వతశిలలాగా విశ్చలంగా నిలబడి ఊర్ద్వబాహువై తపస్సు సాగించాడు.


యోగదీక్షలో ఉన్న దత్తాత్రేయుణ్ని కార్తవీర్యార్జునుడు భక్తిశ్రద్ధలతో సేవించాడు. దత్తుడి హృదయం గెలుచుకున్నాడు. అనేక దివ్యవరాలు పొందాడు. దివ్యరధం, సహస్ర బాహువులు, సహస్రాయుధాలు ఒకటేమిటి ఇలా అనేక వరాలు పొందాడు, సప్త ద్వీపావృతమైన యావద్వసుంధరకూ ఏకైక చక్రవర్తి అయ్యాడు. ఎనభై అయిదు వేల సంవత్సరాలు పాలించాడు. భూరిదక్షిణలతో మహావైభవంగా అనేక యజ్ఞాలు చేసాడు. అతడి యజ్ఞవేదికలూ యూపస్థంభాలూ అన్నీ బంగారమే.


No comments:

Post a Comment