Thursday 24 August 2023

శ్రీదత్త పురాణము (237)

 


విదుర నీతి


ధృతరాష్ట్రా ! నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. ఇది కులానికి చేటు తెచ్చిపెడుతుంది. కనక త్వరగా మేల్కొని నీ పెద్దకొడుక్కి తగిన బుద్దులు నేర్పు.


విదురా ! నువ్వు జ్ఞానివి. సకల నీతి శాస్త్రవేత్తవు. దుర్యోధనుడికి ఏమి నీతులు నేర్పాలో ముందుగా నువ్వు నాకు ఉపదేశించు. వాటిని వాడికి బోధిస్తాను. ఆపైన ఏది జరగాలో అది జరుగుతుంది.


ధృతరాష్ట్రా! సరే అయితే ఆలకించు, పూర్వకాలంలో దత్తయోగీంద్రుడు సాధ్యజాతి వారికి ఉపదేశించిన కొన్ని గొప్ప నీతులు ఉన్నాయి. వాటిని నీకు ఉపదేశిస్తాను. శ్రద్ధగా ఆలకించు అని విదురుడు ఆరంభించాడు. -


ముందుగా మనస్సుకి సంశ్రుతం అలవర్చాలి. దానితో శమదమాదులూ సత్యమూ ధృతీ అలవడతాయి. వాటివల్ల హృదయగ్రంథి విడుతుంది. అరిషడ్వర్గం అంతరిస్తుంది. క్రోధాన్ని క్రోధంతో జయించలేం. సహనంతో ఓర్పుతో జయించగలం. క్రోధమనేది అన్ని అనర్థాలకూ మూలకందం, ఎవడి క్రోధం వాడినే దహించేస్తుంది. వాడి పూర్వజన్మాశ్రిత సుకృతాలను కూడా నాశనం చేస్తుంది. అంచేత అందరూ తితిక్ష అలవరుచుకుని క్రోధాన్ని అదుపు చేసుకోవాలి. అలాగే ఏ మనిషి ఆక్రోశి కాకూడదు, అవమాని కాకూడదు. మిత్రద్రోహి కాకూడదు. నీచోపసేవి కాకూడదు, దురభిమాని కాకూడదు, హీనవృత్తుడు కాకూడదు. రూక్షంగా, పరుషంగా మాట్లాడే అలవాటును క్రమేపీ ప్రయత్నపూర్వకంగా వదుల్చుకోవాలి. ఇది హృదయాలనూ, మర్మాలనూ అస్థికలను సైతం దహించి వేస్తుంది. ఇటువంటి వాక్పారుష్యరూప మహాపాపాన్ని ధర్మారాములందరూ వెంటనే వదిలి పెట్టి దానికి ఆమడల దూరం తొలగిపోవాలి.


No comments:

Post a Comment