Saturday 19 August 2023

శ్రీదత్త పురాణము (232)

 


దీపకా! తెలిసింది కదా దత్తాత్రేయుడి మహర్షిత్వమూ అవతారత్వమూనూ. అంచేత చిలిపి సందేహలన్నీ వదిలేసి బుద్ధిగా దత్తదేవుణ్ని ఆరాధించు- అన్నాడు వేదధర్ముడు.


గురూత్తమా! నిజంగా ఇది నాకు కలిగిన సందేహం కాదు. ఇలాంటి విపరీతబుద్ధులు భావి కాలాల్లో ఆవిర్భవిస్తారనీ పెడసరం ప్రశ్నలు వేస్తారనీ ఊహించి ముందుగానే సర్వజ్ఞులైన మీతో ఇలా సమాధానాలు రాబట్టుకుని లోకానికి తెలుపుడయ్యేట్లు చేశాను. లేకపోతే రేపటి ముందు ముందు కాలాల్లో ఈ ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోవచ్చు. సరే గురుదేవా! దయానిధీ! నీ ముఖ పద్మం నుండి జాలువారే ఈ కధా మకరందం జన్మ జరావ్యాధి మృత్యునివారకం. ఇంతటి అదృష్టానికి నోచుకున్నందుకు నా జన్మచరితార్ధం. కార్తవీర్యుడి గురించి సమగ్రంగా తెలియజెప్పారు. అంతటివాణ్ని అవలీలగా జయించిన భార్గవరాముని గురించి కూడా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించండి.


నాయనా దీపడా! నేను చెబుదామని అనుకుంటున్నదే నువ్వు అడిగావు, భారతంలో వ్యాసమునీంద్రుడు రచించిన భార్గవ రామచరిత్రను క్లుంప్తంగా చెబుతాను ఆలకించు అని వేదధర్ముడు ఇలా చెప్పనారంభించాడు.

భార్గవరాముని చరిత్ర


మాయాద్యూతంలో సర్వస్వాన్ని కోల్పోయిన ధర్మరాజు అనుద్యూతం కూడా ఆడి కట్టుబట్టలతో తమ్ములతో ధర్మపత్నితో వనవాసానికి బయలుదేరాడు. మరికొందరు హితులూ, సన్నిహితులూ, మునులు వారి వెంట నడిచారు. అరణ్యాలలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ ఆశ్రమవాసులకు నమస్కరించి దీవెనలు పొందుతూ వనవాసం గడుపుతున్నారు. కొంతకాలానికి మహేంద్ర పర్వతంమీద భార్గవరాముని ఆశ్రమం చేరుకున్నారు. పాండవులు అక్కడి పుణ్యతీర్థాలలో పవిత్ర స్నానాలు చేసి దేవర్షి పితృతర్పణ విధులు నిర్వహించారు. రోమశమహర్షి మార్గదర్శకత్వంలో అక్కడి ఆశ్రమాలనూ అక్కడి ఋషులను సందర్శించారు, ఆశీస్సులు పొందారు. భృగు అంగిరస వాసిష్ఠ కాశ్యప అకృతవ్రణాది మహర్షుల్ని దర్శించి సంబరపడిన ధర్మరాజు భార్గవరాముని - ఆశ్రమమైతే కనిపించింది కానీ ఆ మహర్షి దర్శన భాగ్యం లభించలేదు. ఈ జన్మకి నాకు ఆ అదృష్టం ఎప్పుడో - అని తన అభిలాషను ఆ మహర్షులముందు ప్రకటించాడు. అది విన్న అకృత వ్రణుడు - ధర్మజా ! మీ రాక భార్గవరామునికి ముందే తెలుసు. మీరంటే చాలా ఇష్టం, కనక దర్శనం ఇస్తాడు. సాధారణంగా ఆష్టమికీ చతుర్దశికీ ఈ ఆశ్రమానికి వస్తాడు. ఈ రాత్రి గడిస్తే రేపు చతుర్ధశి. కాబట్టి మీరిక్కడ ఉండగలిగితే రేపే భార్గవరాముణ్ని సందర్శించవచ్చు - అన్నాడు. దీనికి సంబరపడి ధర్మజాదులందరూ ఆ రాత్రికి అక్కడే ఆగిపోయారు.

అతిథి మర్యాదలన్నీ అయ్యి అందరూ తీరికూర్చున్నాక ధర్మరాజు మెల్లగా భార్గవరాముని ప్రస్తావన తెచ్చాడు. ఆకృతివ్రణా ! నువు భార్గవరాముని అనుచరుడివి. ఆ మహాబలపరాక్రమశాలి చేసిన ప్రతి పనికి నువ్వు ప్రత్యక్ష ఆ సాక్షివి. అంచేత భార్గవరాముని పూర్వ వృత్తాంతంలో నీకు తెలియనిదిలేదు. ఆ మహానుభావుడు ముయ్యేడు మార్లు మా క్షత్రియులందరినీ ఏ ప్రకారంగా జయించాడు ? ఏ కారణంగా జయించాడు ? ఈ వివరాలు యథాతధంగా వాస్తవరూపంలో తెలుసుకోవాలని నా కోరిక. అందుకు నువ్వొక్కడ్కివే సమర్థుడిని దయచేసి నన్ను కృతార్ధుణ్ని చెయ్యి - అని అభ్యర్ధించాడు.



No comments:

Post a Comment