Saturday 24 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (01)



హనుమ

ముందుమాట


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా

అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్


ఈ శ్లోకాన్ని బట్టి హనుమానుణ్ణి స్మరించే భక్తులపై అతడెట్టి అనుగ్రహం చూపిస్తాడో తెలుస్తుంది. బుద్ధిని, బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని, ఆరోగ్యాన్ని, జడత్వం లేకపోవడాన్ని, వాక్పటుత్వాన్ని ప్రసాదిస్తాడని అర్థం.


ఇట్లా అన్ని గుణాలూ ఒక్కనిలో ఉండవు. ఎంత బుద్ధిమంతునకైనా ఏదో లోటుంటుంది. బలవంతుడు, మూర్ఖుడు కావచ్చు. పై రెండు ఉన్నా పిరికివాడు కావచ్చు, భయపడవచ్చు. ఎంత సామర్ధ్యమున్నా చురుకుగా ఉండకపోవచ్చు. సోమరి పోతుగా ఉండవచ్చు. పండితుడైనా కొందరికి వక్తృత్వం ఉండకపోవచ్చు. కాని అన్ని సలక్షణాలను ప్రసాదించేది ఆంజనేయ స్వామియే.


సాధారణంగా మనుష్యులలో అన్నీ ఉండకపోయినా విరుద్ధ భావాలుంటాయి కూడా. బలవంతునకు బుద్ధి సంపదలేక పోయినా, బుద్ధిమంతునకు అహంకారంలేని భక్తి లేకపోయినా రాణించదు. కాని ఆంజనేయునిలో అన్ని లక్షణాలున్నాయి. అతడెన్ని విధాల బలవంతుడైనా తనకున్న శక్తి, రాముడనుగ్రహించినదే అని వినయం చూపిస్తూ ఎల్లపుడూ రామదాసుగానే ఉండాలని భావిస్తాడు. సేవకునిగా ఉంటే అతనిలో సంపూర్ణత్వం ఉంది. ఎవరికైనా భక్తియున్నా అది ఎందుకో స్పష్టంగా లేకుండా అనగా జ్ఞానసహితమైనది కాకుండా మూఢభక్తితో ఉంటారు. ఇక అట్టివారు భక్తి జ్ఞానాలు ఒకదానితో ఒకటి పడవనీ భావిస్తారు. రామునకెంత భక్తుడో అంతటి సుజ్ఞాని. వైదేహీ సహితం.... సనకాది ఋషులకు దక్షిణామూర్తి ఉపదేశించినట్లు ఆంజనేయునకు రాముడు తత్త్వోపదేశం చేసాడు. అర్జునుని కేతనం మీద ఉంటూ కృష్ణుడు చెప్పిన గీతను అర్జునునితో బాటు విన్నాడు. పైశాచీ భాషలో ఒక గీతా వ్యాఖ్యానం ఉందని, తత్వంతో నిండియుంటుందని దానిని ఆంజనేయుడే వ్రాసాడని అంటారు. రాముడే మొట్టమొదట సమావేశంలో ఇతణ్ణి నవవ్యాకరణ వేత్తయని కొనియాడాడు. అతడెంత బుద్ధిమంతుడైనా, పండితుడైనా, వినయభరితుడై భక్తి ఇచ్చే ఆనందంలో మునిగియుండేవాడు. 


No comments:

Post a Comment