Tuesday 27 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (04)



సరస్వతి, ఒక షరతు పెట్టి అంగీకరించింది. నీవు వెడుతూ ఉండగా నన్ను చూడడానికి వెనుదిరిగి చూడకూడదు సుమా! ఒకవేళ చూస్తే అక్కడే ఉండిపోతానని శంకరులతో చెప్పింది.


శంకరులు ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె కూడా అనుసరించింది. ఆమె అందెల రవళి వింటూ ఉండడం వల్ల అనుసరిస్తోందని భావిస్తూ ఉండేవారు. వెనుదిరిగి చూడలేదు.


శంకరులు జ్ఞాన దృష్టిచే అన్నిటిని గ్రహించగలరు కదా! అవతార పురుషులైనా మానవ ధర్మాన్ని అనుసరించి మానవునిగానే ఒక్కొక్కప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు.


వస్తూ ఉండగా తుంగభద్రా నదీ తీరంలో శృంగేరిలో ఒక వింత జరిగింది. " కప్ప ప్రసవిస్తూ ఉండగా ఎండపడకుండా తన పడగను పాము కప్పే దృశ్యాన్ని చూసారు. పాము, కప్పను మ్రింగడం లోక సహజం. కాని ఇక్కడ సహజ శత్రుత్వం లేదు, సరికదా మిత్రత్వమూ కన్పించింది. ఇట్టి పవిత్ర ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠిస్తే మంచిదని భావించారు. అందెల చప్పుడు వినబడడం లేదు. తుంగభద్రానదీ తీరం వెంట వస్తున్నారు. ఆ ఇసుక తిన్నెలలో ఆమె పాదాలు కూరుకొనిపోయి యుండవచ్చని భావించి వెను దిరిగి చూసారు. అక్కడే శారదా పీఠాన్ని స్థాపించారు.


నీ వెనుక వస్తానని సరస్వతి, లోగడ చెప్పింది కదా! తదనుగుణంగా ఈ రామేశ్వరంలో శంకరమంటపంలో సరస్వతీ విగ్రహం, శంకరుల విగ్రహం వెనుకనే ఉండడం పై కథను గుర్తుకుతెస్తుంది.


ఎవరైనా ఏదైనా పుస్తకం వ్రాసేటపుడు గురువందనం, తరువాత గణపతిని స్తుతి చేస్తారు. తరువాత సరస్వతీ స్తుతి ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం కూడా శంకరుల వెనుక సరస్వతి యుండడానికి కారణం కావచ్చు.


No comments:

Post a Comment