Saturday 10 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (227)



ఇట్లా గుర్తించకుండా ఈ విశ్వం అంతా ఈ జీవులందరూ నిజమని భ్రమిస్తూ ఉంటాం. ఇట్లా భావించడాన్ని మాయయని అంటారు. ఈ మాయా ప్రపంచం రకరకాల చమత్కారాలను చేస్తూ ఉంటుంది. ఇది నడవడానికి కొన్ని నియమాలున్నాయి. వాటి ప్రకారం ఇది నడుస్తూ ఉంటుంది. నిష్క్రియమైన బ్రహ్మము మాయవల్ల విశ్వంగా కనబడి సృష్టి స్థితి సంహారాలను చేస్తున్నట్లుగా ఉంటుంది. ఏ పని లేనపుడు బ్రహ్మమని, పనులున్నపుడు ఈశ్వరుడని అంటాం. నిష్క్రియ నిర్గుణ స్థితినే బ్రహ్మమని, క్రియా సహితమైనపుడు ఈశ్వరుడని, భగవానుడని, స్వామియని ఎవరిని అంటామో అది అంతా సగుణ బ్రహ్మనుద్దేశించినదే. 


మనం నిరంతరం ఏవో పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేయకపోయినా మనస్సుతోనైనా ఆలోచించకుండా ఉండలేం. ఈ ఆలోచన కూడా ఒక పనే. మనస్సులో భావాలెప్పుడుదయించవో అనగా భావాతీత స్థితియే బ్రహ్మము. కాని క్షణకాలం భావాలు లేకుండా చేయలేం. ఎట్లా ఈ మనస్సును ఆపడం?


ఈ అభ్యాసం భక్తివల్లనే సాధ్యం. క్రియా రహితమైన స్థితిలోనే బ్రహ్మానుభవం కల్గుతుంది. ఆ బ్రహ్మమే ఈశ్వరుడై అన్ని పనులూ చక్కబెదుతున్నాడు కదా! కనుక అన్ని పనులను ఆ ఈశ్వరునివైపు మళ్లించగలగాలి


నమస్కరించుట, పూజ మొదలైనవి శరీరంతో, స్తోత్ర పఠనం నాల్మతో, ధ్యానం మనస్సుతో ఇట్లా అన్ని పనులను అతనివైపే మళ్లించగలగాలి. వీటిని అట్లా మళ్లించితే, ఈశ్వరుడంగీకరిస్తాడు. బ్రహ్మ జ్ఞానం మనలో కల్గిస్తాడు. ఇట్లా ఏ పని చేసినా వానికి చెందిందే అని, వానికై చేయడాన్ని భక్తియని అంటారు. ఇది అవిచ్చిన్నంగా సాగాలి. అనగా నిరంతరంగా ప్రేమతో ఇట్లా పసులు చేయడమే భక్తి.  


No comments:

Post a Comment