Sunday 25 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (02)



భక్తియుంది కదాయని ప్రపంచ వ్యవహారాలను పట్టించుకోలేదని భావించకండి. ఆర్తులను, బలహీనులను కాపాడుటలో ఇతణ్ణి మించిన వారెవ్వరూ లేరు. లోకసేవా ధురంధరుడు.


జ్ఞానం యొక్క పరకాష్ఠను, బలపరాక్రమాల అవధిని, భక్తి సామ్రాజ్య విస్తరణను, కీర్తి పతాకాలను, అపరిమిత సేవను, అగణనీయ వినయ సంపదను అన్నిటిని ఒక్కచోట చూడదలచుకొంటే స్వామినే స్మరించాలి.


అంతకంటే తన బ్రహ్మచర్యాన్ని ముందుగా పరిగణించవలసి వస్తుంది. కామవాసన అణుమాత్రం లేని అస్ఖలిత బ్రహ్మచారి. తన కోసం తానేమీ ప్రయత్నం చేయలేదు. కామరాహిత్యం, రామసేవ వల్లనే పరిపూర్ణత్వం.


హనుమాన్ అని తమిళులంటే కర్ణాకటలో హనుమంతప్పయని, ఆంధ్రప్రదేశంలో ఆంజనేయుడని, మహారాష్ట్రలో మారుతియని, ఉత్తరదేశంలో మహావీరుడని పిలుస్తారు.


ఆయనను స్మరిస్తేనే మనలో ధైర్యం పొటమరిస్తుంది. జ్ఞానోదయం, కోరికలు తీరుట, జరుగుతుంది. అతని మాదిరిగా వినయంతో భగవత్ కైంకర్యం చేద్దాం.


ఎక్కడ రామనామం వినబడినా, ఎక్కడ రామాయణ ప్రవచనమున్నా, మనకంటికి కనబడకపోయినా అక్కడ సాక్షాత్కరిస్తాడు. కథలో, నామంలో మునిగి ఆనందాశ్రువులను రాలుస్తాడు.


మిగతా లక్షణాల కంటే ఈ కాలంలో వినయం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఇంకా ఏవో కావాలని ఆరాటపడుతూ ఉంటాం. అంతం కనబడడం లేదు. మనకు వినయ సంపద ఉన్నపుడు మాత్రమే ఈశ్వరానుగ్రహం పొందగలం. అదే తృప్తిని, సంపూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ సంపూర్ణ తృప్తిని ఆంజనేయుడు అనుగ్రహించుగాక.

No comments:

Post a Comment