Friday 30 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (07)


ఆంజనేయుని ఆజ్ఞననుసరించి సముద్రం అణగియుంది. మనమేమో సంసార సాగరంలో చిక్కుకొన్నాం. సముద్రంలోని అలలు మాదిరిగా మనభావాలు అల్లకల్లోలంగా ఉంటాయి. కాని ఆంజనేయుడు మనోనిగ్రహం. కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు.


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం


అట్టి అభయాంజనేయ మూర్తిని దర్శిస్తే, ధ్యానిస్తే మన భయాలను తరుమడమే కాకుండా శాంతి సౌభాగ్యాలను అందిస్తాడు. సంసార సాగరాన్ని అల్లకల్లోలం లేకుండా చేయగలడు.


బలప్రదాత


బలహీనులకు బలాన్నిచ్చేవాడు, రామచంద్రమూర్తి, నిర్బల్ కే బల్ రామ్ అని హిందీలోని మాట. ప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు రక్షించేవాడు రాముని కంటే మరెవ్వరు? ఆపదామ్ అపహర్తారం అని కీర్తిస్తాం. మనకు ముందు, వెనుక, ప్రక్కల, అన్ని వైపుల రక్షించేవాడు రాముడని కీర్తిస్తాం.


అగ్రతఃపురతశ్చైవ పార్శ్వ ఏవ మహాబలౌ.


మనలను రక్షించడానికి ధనుర్బాణాలతో రాముడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ రాముని విడువని లక్ష్మణుడున్నాడు.

ఆ కర్ణపూర్ణ తన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ

అంతటి విజయరాఘవుడు, వీర రాఘవుడు తాను సాధించినది హనుమ వల్లనే అని లోకానికి చూపిస్తాడు.

రాముడు మానవునిలా ప్రవర్తించాడు. రావణుడు, సీతనెక్కడ దాచాడో తెలియనట్లే ప్రవర్తించాడు. మానవునిగా నుండి దుఃఖంలో మునిగియుండగా హనుమ, సీతను వెదికి, రామునకు ఉత్సాహాన్ని, బలాన్ని కల్గించాడు.

సీతనుండి కేవలం వియోగం కంటే వియోగబాధ, కొన్నివేల రెట్లు ఎక్కువగా అనుభవించాడు. తన ప్రక్క లేకుండా ఆమె ఎట్టి కష్టాలను అనుభవిస్తోందో అని బాధపడ్డాడు. ఆమెకు అదనంగా మరొక బాధ ఉంది. అది రావణుని చెరలో ఉండుటయే. స్త్రీని అబలయని అంటారు. మహాలక్ష్మి సీతగా అవతరించి అశోకవనంలో బాధపడింది. మామూలు స్త్రీ కంటే ఎక్కువగా బాధపడి, ఉరిపోసికొందామని భావించింది కూడా. ఆంజనేయుడు ఆమెకు ధైర్యాన్ని, బలాన్ని, ఉత్సాహాన్ని కల్గించాడు.

అతడు చేసిన ఆశ్చర్యకర సంఘటనలు ఒకటా, రెండా? అగణనీయం. అన్నిటికంటే జీవితాన్ని త్యజించాలనే సీత యొక్క శోకాన్ని పోగొట్టడం గొప్పది.

No comments:

Post a Comment