Monday 2 June 2014

హిందూ ధర్మం - 74 (త్రిశంకు స్వర్గానికి వెళ్ళటం)

దేవతలు రావడం లేదని కోపంతో విశ్వామిత్రుడు చేతిలోకి సృవాన్ని(అగ్నిహోత్రంలో హవిస్సు వేయడానికి వడే చెక్క పరికరం) తీసుకుని, దాన్ని ఎత్తి పట్టుకుని పైకి ఊపుతూ, ఒక్కసారి లేచి నిల్చుని తిశంకుతో ఈ విధంగా అన్నారు.  ఓ రాజా! ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. నాకున్న శక్తి చేత, నిన్ను ఇప్పుడే ఈ శరీరంతో స్వర్గానికి పంపుతాను. దేవతలు వచ్చి హవిస్సు తీసుకోకపోతే నువ్వు వెళ్ళడం అసాధ్యం. వాళ్ళకి నా శంక్తి తెలియదు. కానీ నేను చేసిన తపస్సు వలన నాకు శక్తి వచ్చింది. దాన్ని వినియోగిస్తాను అన్నాడు. ఈ మాటలు పూర్తి అవుతున్న సమయంలో ఇతర ఋషులు చూస్తుండగా, త్రిశంకు స్వర్గ లోకం దిశగా ఆకాశంలో పైకి వెళుతున్నాడు. త్రిశంకు స్వర్గంలో ప్రవేశించడం చూసి, ఇంద్రుడు, మిగితా దేవతలు ఈ విధంగా అన్నారు. 'త్రిశంకు! ఇదేమైనా నీ విహారస్థలము అనుకున్నావా? అక్కడే ఆగు! నీకు గురువు (వశిష్టమహర్షి) శాపం ఉన్నందువల్ల నీకు ఇక్కడ స్థానం లేదు. ఓ మూఢా! తలకిందులుగా భూలోకంలో పడు'.

వెంటనే త్రిశంకు విశ్వామిత్ర మహర్షిని ఉద్ద్యేశించి రక్షించండి, రక్షించండి అంటూ క్రిందకు పడ్డాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడు బదులుగా ఇంకా కోపంతో ఆగు, ఆక్కడే ఆగు అంటూ అరిచారు. త్రిశంకును దేవలోకానికి రానివ్వకపోతే నేను చూస్తూ ఊరుకోను, నేనే ఇంకో స్వర్గాన్ని సృష్టిస్తాను అన్ని దక్షినదిశలో సప్తఋషి మండలాన్ని సృష్టించారు. (మాములుగా సప్తఋషి మండలం ఉత్తరదిక్కులో ఉంటుంది. ఇది దేవతలకు వ్యతిరేకంగా చెస్తున్నాడు, ఉత్తరానికి ఎదురుగా దక్షిణ దిశలో సృష్టించాడు.) నక్షత్రాలను, గెలాక్సీలను కూడా తయారు చేశాడు. అయిన విశ్వామిత్రునిలో కోపం చల్లారలేదు. అదే కోపంతో ఇప్పుడు నేను వేరొక స్వర్గాన్ని చేసి, అందులో దేవతలను, ఇంద్రుడిని కూడా సృష్టిస్తాను. ఇంద్రుడి అవసరం కూడా నా స్వర్గానికి లేదు అంటూ సృష్టి ప్రారంభించగా దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ ప్రమాదమేంటి? ఈయన వేరొక స్వర్గాన్ని సృష్టితున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు, ఇది ధర్మవిరుద్ధం, సృష్టి నియమాలకు విరుద్ధం అని రాక్షసులు, మునులతో కలిసి దేవతలందరూ విశ్వామిత్రుని ఆశ్రమాన్ని చేరుకుని 'మీరు తపస్సు చేత గొప్ప స్థితిని పొందారు. మీ తెలియనిది కాదు. త్రిశంకు తన గుర్వుల చేత శపించబడ్డాడు. కనుక అతడు తన భౌతిక శరీరంతో స్వర్గ ప్రవేశానికి అనర్హుడు' అన్నారు. ఇది విన్న విశ్వామిత్రుడు గట్టి స్వరంతో 'నేను సశరీరంతో త్రిశంకును స్వర్గానికి పంపుతానని అతనికి ప్రమాణం చేసాను. ఆ మాటను అసత్యం చేయడం, తప్పడం నాకు ఇష్టంలేదు. త్రిశంకు శాశ్వతంగా స్వర్గంలో ఉండుగాకా. నేను సృష్టించిన నక్షత్రాలు, తారలు, ఇతరములన్నీ ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి. మీరు నా స్వర్గాన్ని కూడా అంగీకరించండి' అన్నాడు దేవతలతో.

To be continued ............

No comments:

Post a Comment