Thursday 5 June 2014

శ్రీ మాతా అమృతానందమయి సందేశం

పిల్లలు! ప్రకృతి విపత్తులు, భూతాపం, ఇతర వాతావరణ మార్పులు మానవుల మానసిక ప్రశాంతతను నాశనం చేస్తున్నాయి. ఎందుకంటే మనం సాగుస్తున్న అనాలోచిత దోపిడి కారణంగా ప్రకృతితో బంధం దెబ్బతింటోంది. మన గాలి, మన నీరు, మన భూమి విషతుల్యం అవుతున్నాయి.

పూర్వపు రోజుల్లో ప్రజలు ఎడ్లబండ్లు, గుర్రపుబగ్గీల్లో ప్రయాణం సాగించేవారు. ఆ తర్వాత స్కూటర్లు వచ్చాయి. ఇప్పుడు ఒకే వ్యక్తికి రెండు, మూడు, అంతకంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. పూర్వం మనం అరిటి ఆకులో భోజనం చేసేవారము. ఈ రోజు మొత్తం చెట్లను నరికేసి, పేపరు కప్పులు, ప్లేట్లు తయారు చేసుకుని, ఒక్కసారి మాత్రమే వాడుకుని అవతల పడేస్తున్నాం. ఈ విధంగా, మరియు అనేక విధాలుగా ప్రకృతి మాతను దోచుకుని, ఆమె వనరులను వృధా చేస్తున్నాం.

ప్రకృతిని కామధేనువుగా భావించే సంప్రదాయం మనది. అదే విధంగా ప్రకృతి కూడా మనకు అన్ని శుభాలను చేకూర్చింది. ఇప్పుడు ఆమె ముసలిదయ్యింది, ఎండిపోయింది. మన అడవులు తరిగిపోతున్నాయి, ఆహార ఉత్పత్తి అంతర్ధామవుతోంది. స్వఛ్చమైన గాలి, నీరు దొరకడం అరుదు. వ్యాధులు పెరుగుతున్నాయి.

మనం ఎక్కడ పొరపాటు చేశాం? అవసరానికి, విలాసానికి / సుఖానికి మధ్య బేధాన్ని మనం మర్చిపోతున్నాం. ఇది మనం అర్దం చేసుకోవాలి. ప్రకృతి నుంచి అవసరానికి మించి తీసుకోవడం పాపం, అధర్మం కూడా. నేను ఒక సామాజిక కార్యకర్త కధ గుర్తు చేస్తాను. తెల్లవారుఝామున అతను పళ్ళు తోముకోవడం కోసం నీటితో నింపబడిన పాత్రను తీసుకుని నది దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అతని సహచరులతో అతను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంతలో ముఖం కడుక్కోవడం కోసం అతను తన పాత్రను తీసుకోగా, అందులో నీరు లేవని గమనించాడు. ఓ భగవంతుడా! నేను ఎంత అజాగ్రత్తగా వ్యవహరించాను. ముఖం కడుక్కోవడం పూర్తవ్వకముందే నేను మొత్తం నీటిని ఉపయోగించాను అంటూ బాధపడ్డాడు.

పక్కనే ఉన్న అతని సహచరులకు ఇతను ఇంతగా ఎందుకు బధాపడుతున్నాడో అర్దమవ్వక అతనితో 'ఇందులో బాధపడే విషయం ఏమున్నది? నీ పక్కనే నీటితో నిండిన నది ఉంది కదా' అన్నారు. దానికి బదులిస్తూ అతను 'నదిలో ఎంతో నీరు ఉండవచ్చు కానీ నా అవసరానికి మించి వాడుకునే హక్కు నాకు లేదు' అన్నాడు.

ఆ సామాజిక కార్యలర్త చూపించిన ధర్మాచరణను, మన తరం కనుక తిరిగి గుర్తుంచుకుని ఉంటే - ధర్మం గురించి అవగాహన ఉంటే - పేదరికం, కరువు అనేవి నిర్మూలించబడతాయి. నాకు ఈ విషయంలో సందేహం లేదు. మీరు బ్రతకడానికి అవసరమైనంత మాత్రమే ప్రకృతి నుంచి తీసుకోండి. అప్పుడు అందరికి సరిపడా ఆహారం, నీరు, వస్త్రాలు అందుతాయి. ప్రకృతిమాత తిరిగి కామధేనువుగా మారుతుంది.

ఈ భూమిపై ఉంటున్న అన్ని క్రిమికీటకాలు అంతరించిపోతే, రాబోయే 50 సంవత్సరాలలో భూమిపై జీవం అంతరించిపోతుంది. అదే ఒకవేళ మానవజాతి కనుక అంతరించిపోతే, తరువాతి 50 సంవత్సరాలలో జీవరాశి మొత్తం వృద్ధి చెందుతుదని ఒక శాస్త్రవేత్త అన్నారు. పిల్లలు, భూమి బ్రతకడం కోసం మానవులు నశించపోవలసిన అవసరంలేదు.

మన తాతముత్తాతలు మనకు అప్పగించిన ఈ భూమి అతిసుందరమైనది. దాన్ని నాశనం చేసి మాత్రమే తరువాతి తరానికి అందిస్తామా?  ఈ భూమికి చిన్న పగుళ్ళు కూడా లేకుండా తరువాతి తరాలకు అందించవలసిన ధర్మం మన మీద ఉంది. మన సొంత కన్నతల్లి వలనే ఈ భూమిని రక్షించి, పోషించవలసిన అవసరం మన మీద ఉంది. మనం కళ్ళు తెరవాలి. ఇది భూమాత పట్ల మనం నిర్వర్తించవలసిన ధర్మం కాదు, సమస్త మానవాళి పట్ల మనం నిర్వర్తించవలసిన ధర్మం. ఎందుకంటే ప్రకృతి లేనిదే మానవమనుగడ ఉండదు.

ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి.

- శ్రీ మాతా అమృతానందమయి 

No comments:

Post a Comment