Sunday 15 June 2014

హిందూ ధర్మం - 84 (అక్రోధః)

కోపం ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది. సంబంధ భాంధవ్యాలను నాశనం చేస్తుంది. కోపిస్ఠి వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి భార్యాపిల్లలు కూడా ఇష్టపడరు. ఈయనతో ఏం చెప్పినా కసురుకుంటారని తమలో తామే అనుకుని, అతను ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడోనని భయపడుతూ, నిరంతరం చస్తూ బ్రతుకుతూ ఉంటారు. మిత్రులు, చుట్టాలు, దగ్గరివాళ్ళు కూడా చనువుగా ఉండడానికి ఇష్టపడరు. ఉదాహరణకు ఎంతదగ్గరివారైనా ఏదైనా ముక్యమైన శుభకార్యం మీద పిలవాల్సి వస్తే, వారం ముందు రండి ని చెప్పకుండా, శుభకార్యం రోజు తప్పకుండా రండి అంటారు. అతను ముందే వస్తే, ఎవరి మీద కసురుకుంటాడో, ఎక్కడ గొడవపడతాడోనని భయం. తెలిసితెలిసి ఆందోళన కొనితెచ్చుకోవడం ఎందుకను భావిస్తారు. ఎదైనా ఒక విషయం పంచుకుందామనుకున్నా, కోపిష్టి వ్యక్తితో పంచుకోరు. ఆయన అంతేనండి, ఆయనకు ఏం చెప్తే ఏం అంటాడో, ఎందుకొచ్చిన గొడవ, మౌనంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ఒక ఆఫీస్ యజమాని కోపంగా ఉంటే, ఆ రోజు ఆఫీస్ స్టాఫ్ మొత్తం బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. అదే అతను ఎప్పుడు కోపధారి అయితే, ఇక పరిస్థితి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

కోపం వల్ల వ్యక్తికి ఎంత చెడు జరుగుతుందో, అతని చుట్టుప్రక్కల ఉన్నవారికి అంతకంటే ఎక్కువ ఆందోళన కలుగుతుంది. కోపిష్టి వ్యక్తి ప్రశాంతంగా ఉండలేడు సరికదా ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తాడు. అటువంటి కోపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు మహర్షులు. కోపం వచ్చిన ప్రతీసారీ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పుడు తప్పు చేయలేదా? ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే, ఇలాగే ప్రవర్తిస్తానా?  అని ప్రశ్నలు వేసుకోవాలి. కోపం ఎప్పుడు బలహీనులకే వస్తుంది. బలవంతులు ఎప్పుడు కోపగించుకోరు, ఎందుకంటే ఓర్పు కలిగినవాడే నిజమైన బలవంతుడు.

కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించకపోతే పనులు జరగవు. అలాంటప్పుడు కోపం నటించాలే కానీ, కోపానికి గురి కాకూడదు. కోపం అనేదే ఒక దుర్గుణం. దుర్గుణాన్ని విడిచిపెట్టాలే కానీ అదుపు చేసుకోకూడదు అంటారు గురువులు. అక్రోధః - కోపం లేకుండుట - మనుమహర్షి ధర్మానికి చెప్పిన పది లక్షణాలలో ఒకటి.  

To be continued ................

No comments:

Post a Comment