Saturday 5 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (12)



ఇచట మాటకున్న శక్తి ఎట్టిదో- దానిని ఎలా వశం చేసుకోవాలో హనుమంతుడు తన సంభాషణద్వారా తెలియపరచినాడు. ఇసుమంతైనా పరిచయం లేనివారితో మాట్లాడునపుడు ముందుగా తనను తాను పరిచయం చేసుకోవాలి. అందులో ఆత్మస్తుతి పనికి రాదు. వినయంతో కూడిన ఆత్మార్పణ కలిగి ఉండాలి. మాటకారిత్వం. హనుమంతుని మాటలకు రామ లక్ష్మణులు మంత్రముగ్ధులైనారో అలాంటి మాట నేర్పు కలిగి ఉండాలి.


మాటలచేత దేవతలు మన్ననజేసి వరంబు లిత్తుర  

మ్మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు లిత్తుర 

మ్మాటలచేత కాముకులు మన్నన జేసి సుఖంబు లిత్తుర

మ్మాటల నేర్వకున్న నవమానము నూనము మానభంగమున్. 


అంటాడు ఓ కవి. మధుర భాషణము మానవుని మాననీయునిగ చేస్తుంది. చక్కని మాటకారిని అన్నిచోట్ల, అన్ని వేళలా అందరూ ఆదరిస్తారు. ఏనాడూ ఎవరిని ఏ సన్నివేశంలోనూ మెచ్చుకోని వాక్యజ్ఞుడూ, వాళ్య కుశలుడూయైన రాముడు మొదటి చూపులోనే ఎంత గానో మెచ్చుకున్నాడూ అంటే ఆంజనేయుని వాక్ నైపుణ్యం ఇంతింతనరానిది. ఆ బుద్ధి కుశలతను వాల్మీకి వాక్యకోవిద అంటాడు. అంటే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలో తెలిసినవాడన్నమాట. ఇదొక సమ్మోహనాస్త్రం. ఆ బుద్ధికుశలత మూడు విధాలుగా ఉంటుందని చెప్తారు. అవి సదా జ్ఞప్తి యందుంచుకొనుట అవసరం.


స్మృతిర్వ్యతీతవిషయా మతిరాగామి గోచరా !

బుద్ధి స్తాత్కాలికీ జ్ఞేయా ప్రజ్ఞా త్రైకాల్య గోచరా ॥ 


గతాన్ని గమనిస్తూ వర్తమానాన్ని పరికిస్తూ భావిని ఊహిస్తూ పొందికగా మాటలాడాలన్నమాట.


No comments:

Post a Comment