Friday 18 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (25)



జితేంద్రియుడు 


సంతోషాతిశయంతో సముద్రపుటొడ్డు చేరారు. సాగరాన్ని చూడగానే అంత సంతోషం ఒక్కసారి మటుమాయమయింది. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని తరించేది ఎలాగ? అందరి ముఖాలు వెలవెలబోతున్నాయి. తమలో ఎవరెవరు ఎంతవరకు ఎగురగలరో చల్లగ చెబుతున్నారు. "ఈ సముద్ర లంఘన వయసులోనైతే నా వల్లయ్యేదేగాని ఇపుడు వార్ధక్య భారం కారణంగా అంత దూరం ఎగురలేను, ఐనా తొంబై యోజనాలు వెళ్ళిరాగలను. నేనీనాటి వాడనా!" అంటూ తన వయస్సును, అనుభవాలను అందుకున్నాడు జాంబవంతుడు. ఇలా అందరూ ఒకచోట చేరి సాగర తీర్ణం. తమ శక్తి సామర్థ్యాలను గురించి చెప్పుకుంటుంటే. “నేను ఛస్తే లేవను- లేచానా మనిషిని కాను" అని కుంటివాడు అన్నట్లుంది వీరి ప్రసంగ ధోరణ.


కార్యసాధకుడు మాటలలో మూగ, చేతలలో సర్వసమర్థుడు


ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు మౌన మునిలా ముద్రాంకితుడై ఏదో అనిర్వచనీయ ఆనందానుభూతుల్లో ఓలలాడు తున్న ఆంజనేయుని చూచాడు జాంబవంతుడు. అతని కనులు ఆంజనేయునిపై పడ్డాయి. అతడే అనితరసాధ్య సాధకుడనుకున్నాడు. దగ్గరకు చేరి ఇలా అన్నాడు.


సర్వశాస్త్ర విశారదా! హనుమా! ఏమీ పట్టనట్లు మౌనంగా, ఒంటరిగా కూర్చున్నా వేమియ్యా! 


"తూషీణం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసి”


నీవిటులుంటే మమ్మీవిపదంబుధి నుండి దాటింపగలవా రెవరయ్యా! అమిత బలశక్తి సంపన్నా! యీ సముద్ర లంఘనం నీకొక లెఖ్కా! తండ్రికి తగిన తనయుడవే!! వైనతేయునంత బాహు బలశాలివి కదా! నీ భుజబల, బుద్ధి బలాలలో సాటిరాగల వాడీరేడు జగాల ఏరయ్యా!! ఇక మౌనం చాలు. దిగాలుపడి, విషణ్ణవదనాలతో నున్న నీవారిని ఒకసారి చూడు. పటుతర బుద్ధి శాలివై లేచి- కాలయాపన చేయక సముద్రమును దాట సిద్ధంకా! సీతామాతను చూచిరా! నీపై ఆశతో ప్రాణాలు నిలుపుకున్న వీరందరిని కాపాడు. కేసరి పుత్రా! ఆంజనేయా! సుగ్రీవ సమానుడవు. తేజోబల సంపదలలో రామ లక్ష్మణులంతటివాడవు" అన్నాడు. జాంబవంతుని మాటలు విని వానరులు హర్షధ్వానాలతో తమ ఆమోదం తెల్పినారు. ఈ పొగడ్త వలన ఆంజనేయుడు పర్వదినాలలో ఉప్పొంగే ఉదధిలా ఎదిగాడు. తన బలం తనకు తెలిసి వచ్చింది. నిదురించే సింహం మేల్కాంచి జూలు విదిలించి నట్లయింది. 


No comments:

Post a Comment