Wednesday 23 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (30)



అర్థ సిద్యై హరిశ్రేష్ఠ గఛ్చ సౌమ్య యధా సుఖం 

సమానయస్వ వై దేహీం రాఘవేణ మహాత్మనా


ఎంతగ ఆటంకము లేర్పడుచున్నవో అంతగ రెట్టించిన వేగంతో రామబాణంలా ముందుకు దూసుకుపోతున్నాడు. కొంత దూరంమాత్రమే యీ నడక సాగింది ఇంతలో తన్నెవరో బలవంతంగా పట్టి తన గమనాన్ని వెనుకకు లాగుతున్నట్లనిపించింది. చుట్టూ కలయచూచాడు. ఎవరూ కానరాలేదు. మతిమంతుడు కావడం వలన ఆలోచించి అవలోకించగా తన నీడను పట్టి నీటిలో నుండి ఎవరో లాగుతున్నట్లనిపించింది. అదే సింహికా నామ రక్కసి. ఛాయాగ్రాహిణి. అదొక హింసిక, ఏదో ఒకనాడు-‘దక్షిణ సముద్రంలో ఒక భయంకర రక్కసి కలదని, నీడను పట్టి లాగి వైచి హతమార్చ గలదని, ఆ ప్రాంతాని కేగినపుడు తగు రూకత వహించవలెనని' సుగ్రీవుడు చెప్పినట్లు హనుమకు గుర్తు వచ్చింది. 'ఇదే కావచ్చు' ననుకున్నాడు.


నీటిలోనికి దృష్టి సారించాడు. సింహిక నోటిని తెరచి హనుమంతుని మింగుటకు సిద్ధంగా ఉంది. మారుతి శరీరం పెంచాడు. సింహిక ఇంకా తన నోటిని పెద్దది చేసింది. నోటిలో సింహిక జీవ సానాలు కనిపించినై. అంతే. ఆంజనేయుడు అంగుష్ఠమాత్రుడై నోటిలో ప్రవేశించి దాని మర్మస్థానాలు తన వజ్ర నఖాలతో చీల్చి నిమేషమాత్రంలో బహిర్గతుడయినాడు. సింహిక జవజీవాలు చలించినై. అచేతనురాలై తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళింది. సింహిక కళేబరం నీటిపై తేలియాడింది.


ఆంజనేయుని యీ సముద్రయానం గమనించిన కార్య సాధకున కుండవలసిన ధైర్యము, ఉత్సాహము, కార్యదీక్ష, కర్తవ్యపరాయణత్వాది లక్షణాలు తేటతెల్లము కాగలవు.


"నడచుచు నుండువాని చరణంబులకేగద రాళ్ళ తాకుడుల్" అంటాడు ఒక కవి. రాళ్ళు తగులునని కూర్చుంటే గమ్యం చేరగలమా! తగిలే రాళ్ళను తప్పుకుంటూ ముందుకు సాగాలేకానీ ఆగరాదు. కొంతదూరం వెళ్ళి ఎదురుదెబ్బలకు జంకి వెనుకకు తిరిగిరారాదు. బుద్ధివిశేషంతో ముందుకే మున్ముందుకే సాగి సత్ఫలితాల నందుకోవాలి. అంతేకాదు, మార్గమధ్యంలో లభించిన వానితో సంతృప్తిపడి ఆగిపోరాదు. తన దృష్టిని గమ్యం మీదనే కేంద్రీకరించాలి. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత" లే జాగరూతుడవై గమ్యం చేరువరకు అగకు అంటుంది కఠోపనిషత్తు.

No comments:

Post a Comment