Saturday 19 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (26)



సమావిద్ధ్యచ లాంగూలం హరాచ్చ బలమేయివాన్ 

తేబసా పూర్వమాణస్య రూపమాసీద నుత్తమం.


వాలాన్ని విపరీతంగా పెంచాడు. అతని రూపం వెలుగుల జిలుగులతో నిండింది. "తాతా! నన్నిపుడేం చేయమంటావో చెప్పు. ఇదో గొప్ప పనా? ముజ్జగాల నాక్రమించిన వామనునిలా నేనీ సాగరాన్ని లంఘిస్తాను. లంకా నగరాన్ని గాలించి గాలించి తిరిగి రాగలను. అంతేకాదు, సమూలంగా వాలంతో లంకనే పెకలించి తెస్తాను. రామబాణంలా అమిత వేగంగా దూసుకు పోగలను. తిరుగులేని నా పయన వేగాన్ని ఎవరూ ఆపలేరు. ఆ వేగంతో సీతామాతకై ముల్లోకాలూ వెతుకుతాను. రావణునైనా బంధించి మీముందుంచగలను. నా గమన వేగాన్ని అందుకోగలవారు తండ్రి వాయుదేవుడు, గరుత్మంతుడు మాత్రమే. మీరిక నిశ్చింతగా ఉండండి. త్రికరణశుద్ధిగా నేనీ కార్యాన్ని సాధించగలను" అన్నాడు. వింటూన్న వానరులకు హర్షాతిరేకంతో రోమరోమం నిక్కబొడుచుకుంది, సంతోషంగా కరతాళ ధ్వనులు చేశారు. 


వానరాన్వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ 

యథా రాఘవ నిర్ముక్తి శ్శరశ్శ్వసన విక్రమః 

గచ్ఛే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం 

నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం. 

అనేనై వహి వేగేన గమిష్యామి సురాలయం 

యది వాత్రిదివే సీతాం నద్రక్షామ్యకృతశ్రమః. 

బద్ధ్వా రాక్షసరాజాన మానయిష్యామి రావణం 

సర్వధా కృతకార్యోహ మేష్యామి సహసీతయా.

ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం

ఏవముక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరో త్తమః.


ఇది హనుమంతుని ప్రజ్ఞా వైభవం. సామాన్యంగా కార్య సాధకులు మాటలలో మూగగాను, చేతలలో సర్వ సమర్థులుగా నుండటం జగత్ప్రసిద్ధం, ఐతే ఇచట తనను గురించి తాను ఇంత గొప్పగా చెప్పుకొనుట సమంజసమా. అంటే ఒక్కసారి ఆంజనేయుని పాత్రను గమనిస్తే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాడో గమనించినట్లయితే సన్నివేశానికి తగిన రీతిగా తాను స్పందిస్తూ తనవారిని కాపాడే విధానం చూడగలం. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. తిరగవలసిన తావులన్నీ తిరిగారు. కార్యం సాధించగలం అన్న ఆశే లేదు. ఆశ మానవునిలో నైరాశ్యాన్ని రూపుమాపుతుంది. మరి వారి ఆశ ఎండమావే. ప్రాణత్యాగం వినా మరోదారి లేదన్న భావసలోకి వచ్చారు. మరి ఆ సందర్భంలో తనవారిని ఉత్తేజితులను చేయాలి అంటే వారిని ఉత్సాహపరచాలి. కొత్త రక్తం నింపాలి. మాటలలో, చేతలలో తనలోని ప్రవర్తనను చూచి వారుకూడ అదే స్ఫూర్తితో చైతన్యవంతులవుతారు. అపుడే కర్తవ్యోన్ముఖులై కార్యసాధకులౌతారు. అదే యిచట జరిగింది. అంతే తప్ప స్వాతిశయంగాని, మరొకటిగాని కాదు. భావితరాలవారికి అందించిన ఆంజనేయుని స్ఫూర్తి చైతన్యదీప్తే.


ఆంజనేయుని మాటలకు జాంబవంతుడు సంతోషించి, “పవనతనయా! వానర జాతిని సురక్షించే శక్తియుక్తులు నీకున్నయ్. మహర్షుల, దేవర్షుల, గురువుల అనుగ్రహ వీక్షణం నీకుంది. దేవతాప్రసాదసిద్ధి గలవాడవు. అందరూ నీ క్షేమాన్నే కోరుకుంటుంటారు. కార్యసాధకుడవై తిరిగి వచ్చేవరకు నీకై ఎదురు చూస్తుంటాం" అన్నాడు.   

No comments:

Post a Comment