Wednesday 2 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (9)



కాన “ఓ రాజా ! యీ ఋశ్యమూక పర్వతంమీద నిర్భయంగా యధేచ్చగా చరించవచ్చు. భయపడవలసినది లేదు" అని మారుతి చెప్పిన మాటలు సుగ్రీవునకు ఎడారిలో ఒయాసిస్సును తలపించినట్లయి నది. అందరూ ఋశ్యమూకాద్రి చేరిరి.


"ఏ జనుడు విపత్తి సౌఖ్య సదృశ క్రియు డాతడుమిత్రుడు" అన్నరీతిగా తోడు-నీడగా సుగ్రీవుని వెన్నంటి నడచాడేగాని బృహస్పతివంటి బుద్ధిశాలియైన పవన తనయుడు మునుల శాపకారణంగా తన శక్తి సామర్థ్యాలు మరచిపోవడం జరగకుండినట్లయితే సుగ్రీవుని కష్టాల కడలినుండి ఏనాడో గట్టెక్కించి ఉండేవాడు. నిజమైన మిత్రుడిలా ఉండాలి అని తన నడవడికలో అడుగడు గునా చూపించి సన్మిత్ర మార్గదర్శకుడైనాడు.


"శీలాన్ని గమనించి కలసి మెలసి ఉండండి. మాటకు, నడతకు సంబంధం లేనివాళ్ళతో స్నేహం చేయరాదు” అని సన్మిత్రపదాన్ని సార్ధకం చేసిచూపాడు మారుతి యీ సన్నివేశంలో.


భయమున్న - జయలక్ష్మి నిలువదు


ఇలా వాలిచే బహిష్కృతుడైన సుగ్రీవుడు ఆంజనేయుని ధీశక్తియుక్తులపై పరిపూర్ణమైన విశ్వాసముంచి నిర్భయుడై ఋష్యమూక పర్వతాన మకుటము లేని మహారాజుగా వెలుగొందుచుండెను. ఐతే పగబట్టిన కోడెత్రాచులాంటి మనస్తత్వం కల వాలి స్వయముగా తాను రావీలులేని కారణాన ఆంతరంగికుల నంపి సుగ్రీవుని సంహరింప ప్రయత్నించుచునే యుండెను. కాని వారు సూర్యునిముందు దివిటీలవలె సమీర కుమారుని శక్తి సామర్ధ్యముల ముందు నిలబడలేక పలాయనమంత్రము పఠించుచుండిరి.


No comments:

Post a Comment