Sunday 6 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (13)



హనుమంతుని - ధీ వైభవం


సుగ్రీవ సచివుడైన ఆంజనేయుని మాటలకు ఆనందపరవశుడైన శ్రీరాముడు లక్ష్మణునితో


చూచావా! లక్ష్మణా! ఆంజనేయుని వాక్చాతుర్యం 

సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః 

తమేవ కాంక్ష మాణస్య మమాంతిక ముపాగతః.


అభిభాష స్వసౌమిత్రే సుగ్రీవ సచివం కపిం 

వాక్యజ్ఞం మధురై ర్వాక్యైః స్నేహయుక్తమరిందమ.


నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః 

నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం.


ఋగ్వేదం-స్వర ప్రధానమైనది. ఉదాత్త అనుదాత్త స్వరిత ఫ్లుతాలతో గురుముఖతః అధ్యయనం చేసినగాని అది పట్టుపడదు. దీనికి చిత్త చాంచల్యం పనికిరాదు. మనో నిశ్చలత అవసరం. ఆ విధంగా అధ్యయనం చేసినవాడు వినీతుడు.


యజుర్వేదానికి ధారణ ప్రధానం. ఎందుకంటే ఒకే విధమైన పద జాలాలు మరల మరల తిరిగి తిరిగి రావటం జరుగుతుంది. ధారణ లోపించిన జాయతే వర్ణ సంకరః, కాబట్టి ధారణాశక్తి కల వాడే యజుర్వేదాధ్యాయి.


సామము- గాన ప్రధానమైనది. కాన రాగ తాళ లయ స్వర జ్ఞానములు అత్యంత ఆవశ్యకాలు. ఇది నవనవోన్మేషశాలిని ప్రతిభ అదే వైదుష్యం. వైదుష్యం కలవాడే విదుషి కాగలడు. అంటే యీ మారుతి ఏవం విధమైన మూడు వేదాలను అధ్యయనం చేసినవాడన్నమాట, ఋగ్వేద వినీతుడు. యజుర్వేద ధారి, సామవేద విదుడు. వేదవేదాంగ పారంగతుడు.

నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం 
బహు వ్యాహరతానేన న కించిదప శబ్దితం.

స ముఖే నేత్ర యోర్వాపి అలాటే చ భ్రువో స్తధా 
అన్వేష్వపి చ గాత్రేషు దోషః సంవిదతః క్వచిత్ . 

అంతేకాదు లక్ష్మణా ఇంతసేపు మాటలాడిన మాటలలో ఒక్క అప శబ్దము కూడ దొర్లలేదు. వ్యాకరణం నేర్చినవానికి మాత్రమే అది సాధ్యం.

ముఖము కనులు, కనుబొమలు, లలాటము మొదలైన అవయవాలలో ఏవిధమైన వికారమూ కానరాదు. అంటే శాస్త్రం విధించిన పాఠకాధములు ఆర్గురు. వారు- కూనిరాగాలు తీసేవాడు, సంగీతంలో చెప్పేవాడూ, తల ఆడిస్తూ చెప్పేవాడూ, రాసినదానిని చూస్తూ చదివేవాడూ, శబ్ధ జ్ఞానం అర్థజ్ఞానం లేనివాడూ, తీచుగొంతువాడు. ఆంజనేయునిలో యీ విధమైన వికార భావాలు మచ్చుకైనా లేవు.

No comments:

Post a Comment