Saturday 12 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (18)



అందుకే అంటారు.


రజనీ కరః ఖలు శీతో రజని కరాచ్చందనో మహాశీతః

రజనీ కరచందనాభ్యాం సజ్జన వచనాని శీతాని.


చంద్రుడు శీతల కరణాలతో చల్లదనం కలిగిస్తే చందనం అంతకన్న చల్లదనం కలిగిస్తుందట. ఆ చంద్ర, చందనాలకన్న సమయమునకు తగినట్లున్న మాటకారి చల్లని మాట ఎంతటి ఆవేదననైనా- ఆవేశాన్నయినా ఇట్టేమాయం చేస్తుందట. అంటే ఒక్క మాట సన్నివేశాన్నిబట్టి ప్రయోగించేవాని వాక్చాతుర్యాన్ని బట్టి ఎన్నో రూపాల ఎదుటివానిని ఆకట్టుకుంటుందన్నమాట. ఇట్టి మాట నేర్పుండాలని, ఇంతటి బరువైన సన్నివేశంలో కూడ హృదయానికి తగిలిన ఎంతటి గుండె గాయాన్నయినా మాన్పి గుండె నిబ్బరం కలిగించగలదని లోకానికి చాటాడు హనుమ. స్వయముగ రాముడు వాలికి అంత్య సంస్కారాలు జరిపించి సుగ్రీవుని పట్టాభిషిక్తునిగా- అంగదుని యువరాజుగా చేశాడు.


క ర్త వ్య బో ధ


రామ లక్ష్మణులు ప్రస్రవణ గిరిపై వర్షాకాలము గడిపి నారు. శరదృతువారంభమయినది. కిష్కింధలో సుగ్రీవుడు భోగలాలసుడై తారా, రుమలతో కాలం గడుపుతూ రాజ్యభారం మంత్రులపై నిడి మధిరాస పానమత్తుడై పర్షఋతువు దాటి శరదృతువు వచ్చినా - తన యీ మహోన్నత స్థితికి మూలమైన రామునికి అనాడిచ్చిన తన మాట చెల్లింపునకు ప్రయత్నించు చాయలేవీ కన్పడలేదు.


"ఆకాశం మల్లెపూలవలె తెల్లగనున్నది. నదులలో నీరు నిర్మలంగా ఉంది. నెమళ్ళు నాట్యమాడ మానినవి. మార్గాలు ప్రయాణ యోగ్యాలుగా ఉన్నాయి సుగ్రీవుడు కర్తవ్యాన్ని మరచినట్లున్నాడు" అనుకుని మారుతి సుగ్రీవునిచే సత్యము, మనోహరము, హితము, శ్రవణ సుభగాలైన మాటలతో కర్తవ్యోన్ముఖుని చేయుచు —


రాజ్యం ప్రాప్తం యశశ్చైవకాలే శ్రీరభివర్ణితా

మిత్రాణాం సంగ్రహ శ్శేషః తద్భవాన్ కర్తుమర్హతి.


ఓ రాజా! రాజ్యం లభించింది. సత్కీర్తినందుకున్నావు. కాలానుగుణంగా సంపదా పెరిగింది. వైభవాల కన్నీటికి మూల కారణమైనది. మిత్రకార్యం మాత్రం మిగిలేవుంది. అనాడు ఋష్య మూకాద్రి పైన పవిత్రమైన మిత్రబంధం ఏర్పడినపుడు అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, అందు రాముడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఆ ఉపకారానికి ప్రత్యుపకారంగా ఆనాడు నీవు వర్షాకాలం పూర్తికాగానే సీతాన్వేషణ సాగిస్తానన్నది మాత్రం మాటగానే మిగిలిపోయింది. ఆ మాట మరచావో ? విషయలాలసుడవై ఉపేక్షించావో !

No comments:

Post a Comment