Tuesday 22 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (29)



కాన నా యీ శిఖరాలపై గల మధుర ఫలాలను ఆస్వాదించి కొంత విశ్రాంతి తీసుకొమ్మని కోరగా- మైనాకుని మాటలకు మారుతి సంతసించెను. “మైనాకా! ధార్మిక బుద్ధి అభినందనీయం. కాని రామకార్యార్థినై వెడలు నేను ఒక్కక్షణమైనా ఆగను. ఇది నా నిశ్చయము. పని తొందరలో నున్నాను" అని మైనాకుని స్పృశించి "నీ ఆతిథ్యము నందుకున్నట్లే” అని అమిత వేగంగా ముందుకు సాగాడు.


త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే

ప్రతిజ్ఞాచ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే. 


ఈ దృశ్యాన్ని తిలకించు గగన సంచారులు, విద్యాధరాది అప్సరో గణం ‘ సెహబాస్ వానరపుంగవా' అంటూ హనుమంతుని ఎంతగానో మెచ్చుకున్నారు.


హనుమంతుని శక్తినీ, బలాన్నీ పరీక్షించవలసిందిగా సిద్దులు, గంధర్వులు నాగమాత సురసను కోరారు. సురస వికృతాకారంతో, భీకర రూపముతో "ఏనాడో బ్రహ్మ నిన్ను నాకాహారంగ నిర్ణయించాడు. ఇప్పుడే నిన్ను మింగుతాను. కమ్మగ కడుపునకు విందు చేస్తాను" అంటూ హనుమంతుని ఎదుట నిలచి నోరు తెరచింది. ఇది మరో విఘ్నము కాబోలు ననుకుని పావని ప్రశాంతచిత్తుడై తన ప్రయాణకారణం వివరంగా చెప్పి- తిరిగివచ్చి నీకాహార మౌతాను దారి కడ్డుతొలగమని కోరాడు.


సురస 'ససేమిరా నిను వదలను, వదలను ఇప్పుడే భక్షిస్తాను' అంటూనే నోరు పెద్దది చేసింది. ఆంజనేయుడు ఆ నోటిలో పట్టనంతగా దేహాన్ని పెంచాడు. సురస ఇంకా తన దేహం పెంచి పెద్ద నోరు తెరచింది. బుద్ధిశాలి ఆంజనేయుడు ఇదే అదునుగా భావుంచి లిప్తమాత్ర కాలంలో అంగుష్ఠమాత్రడై నోటిలో ప్రవేశించి మరల తిరిగివచ్చి, "అమ్మా! నీమాట నెగ్గిందికదా! ఇక నాకు సెలవా" అన్నాడు .


ఆనందాశ్రువులు రాల సురస ధీమంతుని హనుమంతుని కొనియాడి "కార్యసిద్ధి నందుదువుగాక !" అని ఆశీర్వదించి "రామునితో సీతను చేర్చు" అని పల్కింది.

No comments:

Post a Comment