Wednesday 30 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (37)



ఆనాటి ఆంజనేయుని అనుభవం యీనాటి సమాజంలో అడుగడుగునా తారసపడుతుంది. ముఖ్యంగా సినిమాలు- టి.వి.ల ప్రభావం వలన యువత పెడదారులు తొక్కుతున్నది. ప్రలోభాలు, పలు ఆకర్షణలు మనస్సు మీద దెబ్బ తీసే ప్రమాదం పొంచి ఉంది. నిగ్రహశక్తి అవసరం.


పైగా శరీరంతో చేసింది తప్పుకాదు. మనస్సుతో చేసిందే. తప్పు అంటారు. “ఏనైవా లింగితే కాంతా తేనై వాలింగితా సుతా" ఈ శరీరంతో కాంతాలింగనం, సుతాలింగనం ఐతే మనస్సున కలిగే భావాల తీరు వేరుకదా! కాబట్టి మనశ్చాంచల్యం కలగనంతవరకు ఏ దృశ్యం వీక్షించినాసరే మనకేమీ అంటదు. నిగ్రహం కోల్పోయిననాడు అతని జీవితం త్రిశంకు స్వర్గమే.


హనుమంతునివలె ప్రతివారికి తాను చేసే పనిలో - మాటాడే తీరులో- అంటే కట్టులో- బొట్టులో - మాటలో- మంతిలో - సర్వే సర్వత్ర ఆత్మ పరిశీలన అవసరం తన మనస్సుకు తాను జవాబు చెప్పుకోవాలి.


ఆత్మకు ఆత్మయే చుట్టం, మిత్రుడు, శత్రువూను. ఆత్మతో ఆలోచించి మంచి సలహాల నందుకోవాలి. అతడే సమాజంలో సత్పౌరుడుగా రాణిస్తాడు. 


"మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" - మనస్సే బంధ మోక్షాలకు కారణం వ్యామోహాలకు, ప్రలోభాలకు చోటీయరాదు హృదయంలో. కాబట్టి మనస్సును పవిత్రముగ నుంచుట నలవరచుకొమ్మని యీ సన్నివేశం మనకు తెలియ చేస్తుంది. 


No comments:

Post a Comment