Sunday 27 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (34)



ఈ సన్నివేశం గమనించినట్లయితే సంభాషణ సానుకూలం కాచటానికి, ఎదుటివారిని తన వశం చేసుకోవటానికి కావలసిన మాట నేర్పు తేటతెల్లం కాగలదు. లంకిణి ఆవేశపరురాలు కాగా ఆంజనేయుడును ఆవేశం పొందలేదు. ఆవేశపరుని దగ్గర తానూ ఆవేశం పొందిన కార్యభంగం తప్ప మరే లాభమూ లేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్లే. ఓర్పుతో నేర్పుగా ఆవేశం చల్లార్చే ప్రయత్నం చేయాలి. అంతేకాక పొగడ్తలకు పొంగిపోవటం- ఎంత కాదనుకున్నా ప్రతి ప్రాణికి సహజం. కార్యసాధకులు ఎదుటి వారిని గొప్పగచేసి తమ పనులు పూర్తిచేసుకుంటారు. ఇదొక ఎత్తు గడ. లంకా నగరం ఎంత గొప్పదో! దేవ నగరం అమరావతిని తలదన్నే రమణీయత గలదని చెప్పగా విన్నాను. చూడాలనే కుతూహలంతో వచ్చాను అంటాడు నింపాదిగా మాటనేర్పును చూచి వాల్మీకి ఆంజనేయుని 'మేధావి' అంటాడు. లౌకిక వ్యవహార లక్షణాలలో ఇది చాలా ప్రధానమైన లక్షణమన్న మాట. అందుకే ఒకచోట మారుతి ఇలా అంటాడు. 'ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేత్ రామ సేవకం' తననుండి ఏవం విధమైన లోకజ్ఞత అలవరచుకోవాలి సుమా! అన్నది సందేశం.


శతృగృహం ఎలా ప్రవేశించాలి ? 


స నిర్జిత్య పురీం శ్రేష్ఠం లంకాం తాం కామరూపిణీం 

విక్రమేణ మహాతేజా హనుమాన్ కపిసత్తమః 

అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపప్లువే 

ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితం కరః 

చక్రేఽథ పాదం సవ్యంచ శతౄణాం స తు మూర్ధని 

ప్రవిష్టః సత్వసంపన్నో విశాయాం మారుతాత్మజః.


మారుతి అలా లంకిణిని జయించి అత్యుత్సాహంతో ముందుకు సాగి- 'ప్రయాణకాలే చ గృహప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాం ఘిర్మ్, కృత్వాగత శ్శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాత్ పురతో నృపాలం' ప్రయాణ కాలమందు గృహప్రవేశ సమయాన వివాహ కాలంలో ప్రథమంగా కుడి పాదం మోపాలి. శత్రు పట్టణ ప్రవేశ సమయంలోనైతే ముందుగా ఎడమ కాలు పెట్టవలె. అట్లు చేసిన శతృవు శిరమునందు అడుగిడినట్లు అన్న రాజనీతిశాస్త్ర మెరిగినవాడు గాన లంకానగరంలోనికి వాకిలి నుండి కాక ప్రాకారం లోనికి ఎడమ పాదం పెట్టి దిగి, రాత్రివేళ కోటలూ, పేటలూ- ఇళ్ళూ, వాకిళ్ళూ- వనాలు, ఉపవనాలూ- పుట్టలూ, చెట్లు ఇలా నగరమంతా అణువణువూ శోధిస్తూ ఒక్క అంగుళం నేలయైనా వదలకుండా అర్ధరాత్రివేళదాకా రమణీయమై, మనోహరమై, చిత్ర విచిత్రమై, నేత్రోత్సవంగా, వీనులవిందుగా సాగే లలితకళా విలసితమైన ప్రదేశాలను గాంచి అందెటను సీతను గానక తిరిగి తిరిగి రావణాంతఃపురం చేరాడు.


No comments:

Post a Comment