Wednesday 16 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (23)



ఆలోచనా శక్తి 


దక్షిణ దిశగా ఆయా ప్రాంతాల విశేషాలను పరికిస్తూ అంగద, జాంబవంత, హనుమంతాది వానర వీరులు ముందుకు సాగుతున్నారు. విరామమెరుగని పయనం. ఆకలిబాధ తీవ్ర మయింది. సుగ్రీవుడు చెప్పిన దారితప్పి నదీ ప్రాంతాలను, పర్వత, అరణ్య భూములను దాటి ఒక బిలద్వారం చేరారు. ఎటు చూచినా ఆకలిదప్పులు తీర్చగల ఫల వృక్షాలుగాని, నీటి మడుగులుగాని కానరాలేదు. ఐతే ఆ బిలద్వారం నుండి తడి ముక్కులతో నీటి పక్షులు రావటం చూచాడు పవన తనయుడు, అదే విషయం తనవారికి చెప్పాడు. "మిత్రులారా! అటుచూడండి. హంసలు, క్రౌంచ పక్షులు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు తడిసిన రెక్కలతో బిలం నుండి బయటకు వస్తున్నాయి. కాబట్టి యీ బిలంలో సరోవరాలో, దిగుడు బావులో ఉండి ఉండాలి. అంతే కాక బిల ప్రాంతాన వృక్షాలు కూడా ఉన్నాయి”


అందరూ కలసి ఆ బిలం చేరారు. అదే స్వయంప్రభాబిలం, నెమ్మదిగా బిలంలోకి దిగారు. నాలుగడుగులు వేశారో లేదో వీరనుకున్నట్లుగా నీటి మడుగు కనిపించకపోగా కనీసం వెలుతురు కూడా లేదు. అంతా చీకటి. కన్ను పొడుచుకున్నా దారి కానరావటం లేదు. పైగా ఇరుకు దారి. ఒకరిని పట్టుకుని మరొకరు నడవసాగారు, కొద్దిదూరం ఇలా సాగింది వారి నడక.

ఇంకొంచెం ముందుకు వెళ్ళగా నయనానందకరంగా వెలుగు కనిపించింది. మున్ముందుకు సాగగానే సుమధుర జలాల సరోవరాలూ, మధువొలుకు ఫల పుష్పభరిత వృక్షాలూ, తమాల, సాల, తాల, అశోక, చంపక, పున్నాగాది వృక్షతతులూ కనులపండుగ చేయుచూ కాన్పించినవి. అటునిటు తిరుగుచుండగా ఇంతకు ముందెన్నడు చూడని అత్యద్భుతమైన రమణీయ సుందర మందిర మొకదానిని చూచారు. లోనికేగి చూచుచుండగా మృగచర్మ ధారిణీ, పద్మాసవాసేన, నిమీలితనేత్రయై తేజఃపుంజములు వెదజల్లు ఒక తాపసిని చూచారు. ఆమెయే స్వయంప్రభ. అది స్వయంప్రభా మందిరం.

No comments:

Post a Comment