Thursday 17 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (24)



చుట్టమగు మధుర వాక్యము కలిమిన్ 


వానర సైన్యానికిదొక పరీక్షా సమయం. ఇపుడేం చేయాలో తెలియక వారు ఒకరి మొగముల నొకరు చూచుకొనుచుండగా  -  

సంకట హరణుడు, పవమాన సుతుడు ఆమెను చేరి మోకరిల్లి - 


అమ్మా! నీవెవరివి? ఎవరిదీ మందిరం? మేము రామకార్యార్థమై సీతామాతను వెతుకుచు అలసి ఆకలి దప్పులకు లోనై ఈ చోటికేతెంచినాము అంటూ తమ వివరాలను పూసగ్రుచ్చినటుల సవివరంగా మధుర వాగ్భణితితో వివరించగా- స్వయంప్రభ సజల నయనాలతో ముందు మీరు స్వాదునీరముల గ్రోలి, మధుర ఫలాల భక్షించుడని అనుమతిచ్చెను. ఆపై తన వృత్తాంతమును చెప్పి "కనులు మూసుకొనుడు. మీరీ బిలమునుండి బయల్పడ గలరని" చెప్పి బయల్పడు దారి కానరాక దిగాలు చెందినవారి నటుల అనుగ్రహించినది! 


ఈ సన్నివేశంలో ఆంజనేయుడు- ప్రవేశించరాని ప్రదేశం చేరినపుడు అందు ప్రతి అణువును పరిశీలించుచు, ఆంటే పరిసరాలను గమనించుచు - ప్రకృతి మార్పులను చూచుచుండవలెనని, దారితెన్నులను గూర్చి, తమ అవసరాలను గూర్చి తెలుసుకొనుటకై అచటివారి ఆగ్రహమునకు గురికాకుండ- అనుగ్రహ పాత్రులగుటకు కావలసిన మాటనేర్పునుపయోగించి తనను, తనవారిని విషమ పరిస్థితులనుండి ఎలా తప్పింపవలెనో చూపిన విధానము అవశ్యం ఆచరింపతగినది. అలవరచుకోవలసినదీ. అందుకే ఒక కవి మాటకారిత్వమును గూర్చి- కాకేమి తన్ను తిటైనె 

కోకిల తన్నేమీ కోకొమ్మనెనే 

లోకము పగయగు బరుసని 

వాకున జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ అంటాడు. 


ఆ అనుగ్రహంతో బిలద్వారం వెలుపల గల అడవిలోనికి రాగలిగారు. ఆప్పటికి సుగ్రీవుడిచ్చిన నెల రోజుల గడువు పూర్తయినది, ఇంతదనుక చూచాయగనైన సీత జాడ తెలియరాలేదు. దక్షిణదిశగా తిరుగవలసిన ప్రదేశమంతయు తిరిగినట్ల యినది. ఇక సుగ్రీవుని ఆగ్రహమున కెరగాక తప్పదు. ప్రాయోపవేశమే మనకిక శరణ్యము అని తిరుగుచున్నంతలో జటాయువు సోదరుడు సంపాతి తారసపడినాడు. మాటల సందర్భంలో రావణుని గూర్చిన సంగతులన్నీ చెప్పాడు. ఇక వానరుల ఆనందానికి హద్దు లేదు.


No comments:

Post a Comment