Sunday 20 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (27)



ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత


ఇలా పలికిన జాంబవంతుని మాటలు సకల దేవతా వర ప్రసాదియైన ఆంజనేయుని ధీవైభవాన్నీ, బల పరాక్రమ శక్తి యుక్తులను తక్షణం స్ఫురణకు తెచ్చినయ్. అంతే అమితోత్సాహంతో ఇంతై ఇంతింతై ఎదుగుతూ "ఒడలు విరిచి ఒక్కసారి మెడ ముందుకు సాచిన మహా వృషభము"ను పోలి ఉన్నాడు. నిరాశ చెంది దిగాలు పడిన వానరుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు.


తతో రావణనీతాయాః సీతాయాః శతృకర్మనః 

ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి ॥ 


శతృకర్మనుడు ఆంజనేయుడు సిద్దచారణులు విహరించే వినువీథిన సముద్రాన్ని దాటటానికై మహేంద్రగిరిపై నిలచాడు. అతని పదఘట్టనకు అంతటి కొండ గజగజలాడింది. అర్థంకాక గుహలలోని జంతువులు బయటకు భయంగా పరుగులు తీసినై, భయంకర విషసర్పాలు బుసలు కొడుతూ రాళ్ళను కాటేస్తున్నాయి. ఆ గిరిపై విహరింప వచ్చిన గంధర్వ, సిద్ధచారణులు భయకంపితులై పరుగులు తీశారు. చెట్లు ఒక్కసారి కదలి పూలను జలజలా రాల్చాయి. ఆ సమయాన మహేంద్రగిరి పూల కొండలా భాసించింది.

తన కార్య సాఫల్యతను కోరుచూ పావని సూర్య, ఇంద్ర, బ్రహ్మాది దేవతలకూ తన తండ్రి వాయుదేవునికి నమస్కరించాడు. పర్వదినాలలో పొంగే సముద్రునిలా- సర్వ శక్తులను కూడ గట్టుకొని పిడికిళ్ళు బిగించి ఒక్క ఉదుటున గగనాని కెగసాడు. ఆ ఊరు వేగోద్ధతికి కూకటివేళ్ళతో పెకలింపబడి వృక్షాలు పైకెగసినై. అవి దూర తీరాలకు సాగిపోవు బందుగులను సాగనంప వచ్చినవారివలె కన్పించినై. ఆ గమన వేగం కడలిని కల్లోల పరచింది, తిమి తిమింగలాది జలచరాలు నీటిని వీడి బయటకెగరినై.

మహర్షులు చుక్కల వీధిని చేరి రామకార్యార్థమై ఏగు ఆంజనేయుని గమన వేగోద్ధతిని చెప్పుకొనుట విద్యాధరాది దేవ గణం విని పరవశమనసులయ్యారు. హనుమను ఆశీర్వదించారు. పయనించే మారుతివాలం ఒకసారి ఇంద్రచాపఁలా, మరో సారి దేహానికి కప్పబడి చక్రాకారంలో కానవచ్చింది. గాలి తాకిడికి సాగరం మహెూత్తుంగ తాల తరంగాలతో ఎగిసిపడింది. 

No comments:

Post a Comment