Saturday 26 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (33)



కథయిష్యామి తే తత్త్వం యన్మాం త్వం పరిపృఛ్ఛసి. 

కా త్వం విరూప నయనా పురద్వారేవ తిష్ఠసి

కిమర్థంచాపి మాం రుద్ధ్వా నిర్బర్త్సయసి దారుణా. 


నేనెవరినో చెబుతాను. ముందు నీ వెవరివో చెప్పు ? వాకిలి కడ్డంగా నిలబడి భీకరాకృతితో వికార నయనాలతో నన్నెందుకు బెదిరించాలనుకుంటున్నావు? హనుమ మాటలు విన్న లకిణి క్రోధావేశంతో ఓ ప్లవంగమా! రావణుని ఆజ్ఞతో యీ ద్వారాన్ని కాపలా కాస్తున్నాను అహం హి నగరీ లంకా. లంకా పట్టణాన్ని నేనే. నన్ను కాదని యీ లంకలో అడుగిడలేవు అని దారుణంగా పలికింది. 


వానరపుంగవుడూ, మేధావీ హనుమ "నేను వానరాన్ని. ప్రాకార తోరణాలతో- వన, ఉపవనాలతో- స్వచ్ఛజలాల సరోవరాలతో- కానన సీమలతో - రమ్య హర్మ్యాలతో అలరారే లంకా నగర సోయగాన్ని తనివితీర చూచి- నాదారిన నేపోతాను. అందు కింత కోపమెందుకు?" అన్నాడు.


ఓరీ వానరాధమా! నను గెలిచినగాని రావణ పాలితమైన లంకాపురిని చూడజాలవు" అంటూ లంకిణి చేయిచాపి ఒక్క చరుపు చరిచింది ఆంజనేయుని. ఆ దెబ్బకు సమీర కుమారుడు “ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః" పెద్దగా అరచి స్త్రీని చంపుట మహాపాపమని పిడికిలి బిగించి ఒక్కపోటు పొడి చాడు. ఆ పోటుకు కళ్ళు బయర్లు కమ్మగా లంకిణి నేలమీద పడి- ఒకనాటి గతాన్ని గుర్తుకు తెచ్చుకొని “వానరా! ఇక నీకు తిరుగులేదు. ఈ లంకా నగరంలో నీవు యథేచ్ఛగా తిరుగు. ఓటమి లంకకు చేటని ఎపుడో విధాత చెప్పనే చెప్పాడు. లంకలోని కేగి నీ కార్యం చక్కబరచుకో" అంటూ దారిచ్చింది.


No comments:

Post a Comment