Thursday 24 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (31)



నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే 'శ్రేయాంసి బహు విఘ్నాని' మంచిపనికే ఆటంకాలెక్కువ అనుట నూటికి నూరుపాళ్ళు నిజం ప్రతి కార్యంలో.


ఆంజనేయుడు మైనాకుని ఆతిధ్యం స్వీకరిస్తూ కర్తవ్యం మరచి స్వార్థ సుఖానికి చోటిస్తే పట్టుదల తరుగుతుందేకాని పెరుగదు కదా! ఉత్సాహం కొరవడేది. నిరుత్సాహం కార్యతిరోగమన కారి.


నాగమాత సురస సందర్భంలో అపాయాన్ని దాటటానికి బుద్ధిబలం ఉపయోగించేవేళ తొందరపడినా- ఆవేశం పెంచుకున్నా ఆవేదన తప్ప మరేముంటుంది, అందుకే ఆంజనేయుడు బుద్ధివైభవంతో యుక్తయుక్తంగా చరించి ముందుకు సాగాడు.


కనిపించని హింసిక సింహిక. ఆమె విషయంలో ఆలోచన పనికిరాదు. కాలాతీతం కారాదు. కార్యభంగం కానిరీతిలో, తన శక్తీతో రక్తి కట్టించాడు. సింహిక మరణవార్త విన్న గగనగాములు 


యస్యత్సేతాని చత్వారి వానరేంద్ర యథా తవ

ధృతిర్దృష్టిర్మతి రాక్ష్యం స్వకర్మను న శీదతి 


అంటారు. ధైర్యం, ముందుచూపు, బుద్ధిబలం, బాహు బలం - ఈ నాలుగు లక్షణాలు ఎవరికుంటవో వారే కార్యనిర్వహణా దక్షులు, ఇయ్యవి పుష్కలంగా హనుమంతునిలో గోచరిస్తున్నాయి.


ఏదేని ఒక కార్యము తలపెట్టినవానిని చూచి శల్య సారధ్యం చేసేవారు కొందరైతే, శకుని పాత్రధారులు మరికొందరు.


ఇంకొందరైతే కల్లబొల్లి కబుర్లతో ముందుకు సాగనీయరు. ఇదో రకం కార్యభంగం, ఇటువంటివారినందరినీ ఒక కంట కని పెడుతూ వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లు వింటూనే గమ్యమే లక్ష్యసాధనగా విఘ్ననిహన్యమానులగుచు ప్రజ్ఞానిధులుగా కార్య సాఫల్యత నందాలి సుమా అని కర్తవ్యబోధ చేశాడు హనుమ.

No comments:

Post a Comment