Sunday 13 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (20)



ఇటువంటి పరిస్థితిని ముందుగనే గమనించి జాగ్రత్తపడిన నీతివేత్త హనుమ. లక్ష్మణుని సమీపించి

 త్వత్తోధికతరో రామో భక్తోయం వానరాధిపః

రామకార్యార్ధమనిశం జాగర్తినతు విస్మృతః. 


మహారాజా! ఈ వానరరాజు రామునకు మీకంటెను గొప్ప భక్తుడు, రేబవలు రామకార్యార్థమైన ఆలోచనే. తన కర్తవ్యమును విస్మరించలేదు. ఇదిగో! ఇటు చూడు. నేల యీనినటుల కనిపించే యీ వానర వీరులు సీతామాతను వెతుకుటకై వచ్చినవారు. త్వరలో సీతాన్వేషనార్థమై నేల నాలుగు చెరగులకు వెళ్ళుటకై సిద్ధముగనున్నారు. సుగ్రీవుడు మిత్రకార్య నిర్వహణలో ఏ లోటూ రానీయడు సుమా! అని సమాధానపరచి లక్ష్మణుని ప్రసన్నునిగ చేసెను.


సహజంగా తమ కళ్ళముందు జరుగుతున్న విషయాలలో ఎవరితో ఏమంటే ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో మనకెందుకులే కాసేపు కళ్ళు మూసుకుని మౌనం వహిస్తే పోలా" అని సరి పెట్టుకునే మనస్తత్వం కలవాళ్ళే ఎక్కువమంది సమాజంలో తారసపడతారు. సకాలంలో సరియైన సలహా ఇవ్వగలిగికూడా ఇవ్వరు, లోపాలను చెప్పరు. పొగడ్తలతో మాత్రం ముంచెత్తుతారు అవకాశవాదులు. ఎటుచూసినా వారికి స్వార్ధం అడ్డు వస్తుంది. స్వార్థానికై ఎదుటివారిని బలి తీసుకుంటానికి కూడా సిద్ధపడతారు. స్వార్థం కొంచెం ప్రక్కన పెట్టి పరార్ధం కోసం పాకులాడరు. ఏ ఇంటిలో దీపం వెలగకపోతే మాకేం- మా ఇంటిలో దీపం వెలగాలి అనుకుంటుంటారు. అట్టివారి విధానానికి ఆంజనేయుని నీతిజ్ఞత ఒక చురక, ఏమాత్రం బెరుకు లేకుండగా ధైర్యంగా ఎదుటివారిలోని లోపాలను తగినసమయంలో నొప్పింపని రీతిలో ఎత్తిచూపి తగిన జాగరూకత వహించునట్లు చేయగల మతిమంతుడు, సారధి, సచివుడుగా యీ పై సన్నివేశంలో కనిపిస్తాడు హనుమంతుడు. మంచన మతి మహత్తును ఇలా చెప్పాడు - 


మతియ కళాకృషి బీజము

మతియ తను ఫలప్రదక్షమాజము తలపన్ 

మతియ చెలి మతియ చుట్టము 

మతిహీనులు చూడ మొరడు మ్రాకులు ధాత్రిన్.

No comments:

Post a Comment