Tuesday 14 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 101 వ భాగం



తరువాత ఏం జరిగింది? 'తరవోభినేదుః', అంటే చెట్లు ప్రతిధ్వనించాయి. అభినేత్రుకు మరొక అర్ధం ఉంది. క్రియ ద్వారా చూపువాడు. అనగా నటుడు. ఒకని వేషం వేసుకొని అతనిలా ఉండేవాడు. రాముడు గతించినా రామ వేషాలు వేస్తున్నారు. నాటకంలో దశరథుడు, రామ అంటే అసలు రాముడు పల్కాడా? అట్లాగే శుకుడు మాట్లాడలేదు. కాని అతని ప్రతినిధులైన చెట్లు ప్రతిధ్వనించాయి. ఎందుకు ఎందుకని ప్రశ్నించాయి? 


చెట్లెందుకు సమాధానం చెప్పాలి? శుకుడు సర్వభూత హృదయుడు, బ్రహ్మజ్ఞాని కనుక అంతటా ఉన్నాడు. కనుక అన్నీ ఇతడై పోయాయి. (‘తన్మయతయా') చెట్లేకాదు, పశువులు, పక్షులు, కొండలు, నదులూ కూడా చెట్లని చెప్పడం నిర్ధారణను సూచిస్తుంది.


శుకుడు సమాధానం చెప్పలేదు. అతడెంత జ్ఞానియైనా అతనిలో ప్రేమ ఉండదా? అందువల్ల చెట్లు సమాధానం చెప్పేటట్లు చేసాడు. అతనికి బదులవి సమాధానం చెబుతున్నాయని వ్యాసుడూ తృప్తి పడియుండవచ్చు. అతని ఆత్మ జ్ఞానమూ వికసించి యుండవచ్చు. ఒక కొడుకొక చోట ఉంటే అతణ్ణి విడిచి పెట్టి యుండలేడు. ఆ కొడుకే అన్ని భూతాలలో ఉండగా అతడెట్లా ఇతనికి దూరంగా ఉండగలడు? కనుక వ్యాసుడు విచారింపనవసరం లేదు. ఇది అనుభవం వల్ల పొందాడు. తన కొడుకు బ్రహ్మయని భావించాడు. అతడు తనతోనూ, అన్నిచోట్లా ఉన్నాడని భావించి యుంటాడు.


అట్టి శుకుని నుండి గౌడపాదుడుపదేశం పొందాడు. అతడు సన్న్యాస గురువు. ఇక గౌడపాదునకు విద్యా గురువు గురించి తెలుసుకుందాం. పతంజలి చరితం గురించి వివరిస్తా.


No comments:

Post a Comment